Monthly Archives: ఏప్రిల్ 2006

మారుతున్న సమాజ ముఖచిత్రం

ఎన్నో రోజుల తరువాత వ్రాస్తున్నాను… కానీ, మంచి విషయాలతో వ్రాస్తున్నానన్న తృప్తి ఉంది. ఎన్నో విషయాలు మనసుకు హత్తుకున్నాయి ఇటీవలి కాలంలో.

 1. హోలీ నాడు భోపాల్ నగరంలో పిల్లలు చేసిందేమిటో తెలుసా? “నీటిని వృథా  చేయకూడదు”, “నీరు లేకపోతే ఱేపు లేదు” (“जल नही तो कल नही”) అంటూ ప్లకార్డులు పట్టుకుని పొడి రంగులతో హోలీ ఆడుకున్నారు. వారికున్నంత సామాజిక స్పృహ పెద్దలకు కూడా ఉంటే…!

2. మన ప్రస్తుత రాష్ట్రపతి, భౌతిక శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొంది, మూడు నెలల శ్రమతో ఆ పుస్తకాన్ని అనువదించారు. చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే వారు అనువదించింది బ్రెయిలీ లిపిలోకి! మీ ఊహ నిజమే… “రచయిత” రాజేంద్ర ధర్వ్, తప్పులు దిద్దిన కమల్ భగోర్ ఇద్దరూ గుడ్డివాళ్ళే! తమ ఉపాధ్యాయుడు సచిన్ దేవాలియా సాయంతో ఈ బృహత్ కార్యం సాధించిన వీరిద్దరూ భోపాల్ నగరంలో అయిదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులు!

3. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి పంచాయితీ పరిధిలో కొంత మంది ఆల్విన్ ఉద్యోగులు ప్రగతినగర్ అన్న పేరుతో 725 ఇళ్ళతో 1991 లో ఒక కాలనీ నిర్మించుకున్నారు. పంచాయితీలో అభివృద్ధి విషయమై అసంతృప్తి చెందిన  ఈ కాలనీ సంక్షేమ సంఘం 1996 లో హైకోర్ట్ సహాయంతో బాచుపల్లి పంచాయితీ నుంచి వేఱుపడి తమంతట తాముగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టారు. సరిగ్గా పదేళ్ళలో వీరు సాధించిన ఘనత ఏమిటో తెలుసా? అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్నట్టుగా అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) ధ్రువపత్రాన్ని పొందిన మొదటి పంచాయితీ ఇదే మన దేశంలో! మద్యం అమ్మకాలు లేవు, 99 శాతం పన్నులు ప్రతి నెలా 15వ తేదీకల్లా వసూలవుతాయి, ఇళ్ళన్నిటికీ మరుగుదొడ్ల సౌకర్యముంది, ఇప్పుడు ఊళ్ళో ఉన్న 1200 ఇళ్ళకూ మంజీరా నది నీటి సరఫరా ఉంది, నీటి వాడకాన్ని సూచించే మీటర్లున్నాయి, ప్రతి ఇంటి ముందు 2-5 మొక్కలున్నాయి, తడి చెత్తకీ పొడి చెత్తకీ వేరుగా అన్ని ఇళ్ళ ముందూ చెత్తబుట్టలున్నాయి, పంచాయితీ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెలో ఉన్న ఫిర్యాదులు చాలా వరకు 24 గంటలలో పరిష్కరింపబడతాయి, అక్షరాస్యత 99 శాతం, … ఇలాగే దేశమంతా ఉంటే… सारे जहॉ से अच्छा हिन्दूस्थान हमारा అని మనమంతా ఆనందంగా పాడుకోవచ్చు, కదా!