Monthly Archives: మార్చి 2011

దొంగల ముఠా … ఎందుకు తీసినట్టు?

గమనిక: ఇది సమీక్ష కాదు! “మఱెందుకు వ్రాసినట్టు?” అనే ప్రశ్నకి సమాధానం టపాలోనే ఉంది.

(నిష్పూచీ: ఈ టపా వ్రాస్తున్నపటికి నేనింకా రామ్‌గోపాల్‌వర్మ తీసిన “దొంగల ముఠా” చూడలేదు. చూసినా నా క్రింది అభిప్రాయంలో మార్పుండబోదు. చూడకపోయినా అలాంటి అభిప్రాయమేర్పఱచుకోవటం తప్పు కాదు.)

కేవలం 6.5 లక్షల రూపాయలతో సినిమా తీసి చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. సంతోషం! (గురుదక్షిణగా వర్మ పేరునే దర్శకుడిగా ప్రకటిస్తూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన (జె.డి.) చక్రవర్తి గతంలో తీసిన మధ్యాహ్నం హత్య చిత్రానికి అయిన ఖర్చు 18 లక్షలని అప్పట్లో విన్నాను. నిజానిజాలు తెలియవు.) “అది మంచి ప్రయోగం!” అని అనను. ఎందుకంటే తెఱ మీద ఆ శ్రమ తాలూకు ఫలితం కనీస ప్రమాణాలతోనే ఉండబోతోందని వర్మకి ముందే తెలుసు. ఇక 6.5 లక్షల రూపాయలతో తీయటం అందఱికీ సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వర్మ అంతటి దర్శకుడు పిలిస్తే రవితేజ, ఛార్మి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసన్న, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సుప్రీత్ మొదలైనవాళ్ళంతా పారితోషికం లేకుండా పని చేస్తారు కానీ మీరూ నేను పిలిస్తే చెయ్యరు, క్రొత్తవాళ్ళని పెడితే చూడరు. “ఇలాంటి వినూత్న ప్రయోగాలనైతే ఆదరిస్తా”మంటూ “బయటి నుంచి మద్దతు ప్రకటించే వాళ్ళు” చాలా మందికి డి.టి.యస్. (నిశ్శబ్దం), అతడు+ఆమె=9, వంశం లాంటి సినిమాలు విడుదలైనట్టు కానీ, అలాంటివెన్నో చిత్రాలు తయారీలో ఆగిపోయిన సంగతి కానీ తెలిసి ఉండకపోవచ్చు. (“ప్రచారం చెయ్యకుంటే మా తప్పా?” అంటారా? నేను తెలుసుకున్నది కూడా వార్తాపత్రికల నుంచే మఱి! పైగా డి.టి.యస్. చిత్రంలో నటించిన ఆదిత్య ఓం, వంశంలో నటించిన చంద్రమోహన్, బాలాదిత్య, నాగబాబు క్రొత్తవాళ్ళు కాదు.) ఆ చిత్రాలెలా ఉన్నాయన్న సంగతి వదిలేస్తే వాటిలో ఉన్న ప్రయోగాత్మకతకి గుర్తింపు దక్కలేదనేది మాత్రమే నా ఉద్దేశం.

ఛాయగ్రహ నిర్వాహకులు/దర్శకులు లేకుండా, 5 మంది కెమెరామెన్‌తో, 5 ప్రధాన పాత్రలతో, 5 రోజులు చిత్రీకరణ జఱుపుకొని, 5 వారాల నిర్మాణోత్తర కార్యక్రమాల తఱువాత విడుదలైన చిత్రం దొంగల ముఠా. ప్రయోగం పేరుతో వర్మ పరమ చెత్త సినిమా తీసాడని చాలా మంది ఉద్దేశం. “సినిమాలు తీసేది యేదో నిరూపించటానికా, లేక వినోదం కోసమా?” అనడిగారు కొందఱు సమీక్షకులు. “కథాకథనాలలో క్రొత్తదనం లేకుండా సినిమాలు తీసి రచ్చకెక్కి ప్రచారంతో బ్రతికేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ”ని చెఱిగేసిన అలాంటి ప్రేక్షకసమీక్షకులకు నా ప్రశ్న: “జేమ్స్  క్యామెరూన్ తీసిన అవతార్ చిత్రంలో మీకు కనిపించిన క్రొత్తదనమేమిటి?” …నాకు తెలుసు, వెంటనే “అవతార్ లాంటి మహాద్భుతానికీ, దొంగల ముఠా లాంటి చెత్తకీ  పోలికనా?!” అంటారని. ఏం, తప్పేంటి?! ఒకడు ప్రయోగం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడుట. ’50ల, ’60ల దశకాలలోనే ప్రతి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రమూ సృష్టించలేదా క్రొత్త ప్రపంచాలను? ఫలానా లాంటి సినిమా తీయాలని నిర్ణయించుకుని, 12 యేళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించి కథాపరంగా, పాత్రల చిత్రణాపరంగా క్రొత్తదనమనేది ఈషణ్మాత్రమైనా లేని అవతార్ చూడాటానికి లేని యిబ్బంది కేవలం ఛాయాచిత్రాలు తీసుకోవటానికి వాడే 5 కెమెరాలతో 5 రోజుల్లోనైనా ఒక చలనచిత్రాన్ని తీయవచ్చని చూపిస్తేనే వచ్చిందా? అవతార్ చిత్రాన్ని ఈ శతాబ్దపు అద్భుతంగా, “తెల్లోడి మాయ”గా తేల్చేసిన చాలా మంది “మేథావి ప్రేక్షకసమీక్షకులు” నా లాంటి మూర్ఖుడికి సమాధానాలు చెప్పరు. కనీసం వాళ్ళకైనా ఆ సమాధానాలు తెలిస్తే చాలని నాకనిపిస్తుంది.

రామ్‌గోపాల్‌వర్మ యెన్ని మాటలు చెప్పి యెంత నాసిరకమైన సినిమాని యెంత విసుగు కలిగించేలా తీసారన్నదే చాలా మందికి కనిపించవచ్చు గాక తెఱ మీద. నాకు మాత్రం చిట్టి (తక్కువ నిడివి) చలనచిత్రాలు తీసే చాలా మంది ఔత్సాహికులకు ఒక నమ్మకాన్నిచ్చారనిపిస్తుంది. పారితోషికం తగ్గించుకుని చలనచిత్ర నిర్మాతలకు మేలు చేయమని యెన్ని రకాలుగా అడిగినా తల ఒగ్గని నటులు నిర్ద్వంద్వంగా ముందుకు రావాలంటే చలనచిత్ర నిర్మాణకారులు చూపించవలసిన నమ్మకం తాలూకు నిలువెత్తు రూపం కనిపిస్తుంది. లాభాల్లో వాటాలే తప్పించి పారితోషికమివ్వకపోవటమన్న పద్ధతి చలనచిత్రరంగానికి మున్ముందు యే రకమైన క్రొత్త ఊపిరులూదగలదో కనిపిస్తుంది. “ఒక సినిమా చేస్తుండగా మఱో సినిమా గుఱించి ఆలోచిస్తే మహాపాపం, కళాసరస్వతికి అవమానం! అది యేకాగ్రతని దెబ్బ తీస్తుంది.” అని “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టు కబుర్లు చెప్పే చాలా మంది దర్శకులకు చెంపపెట్టులా కనిపిస్తుంది. కోడిరామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఉద్దండులు ఏకసమయంలో అనేక చిత్రీకరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఆశాభావం చిగురిస్తుంది.

కొసమెఱుపు: మన ఖర్మ యేమిటంటే సినిమాని ఆరున్నర లక్షల్లో తీసినా అరవై కోట్లతో తీసినా ప్రేక్షకుల నెత్తిన పడే టికెట్ ధరలో మార్పు లేకపోవటం. అది మాఱకపోతే నాలాంటి వాడికి యెన్ని ఆశలు చిగురించినా ప్రేక్షకుడికి జేబు చిఱుగుతూనే ఉంటుంది. ఎప్పటి లాగే అ.సం.రాలో ఈ చలనచిత్రానికి టికెట్ ధర $12. మఱి యీ దొంగల ముఠా వలన వచ్చే బాధలు తీర్చేదెవఱు?!

(షరా: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు చిత్రం కూడా నేనింకా చూడలేదు. ఒకవేళ అదీ బాగాలేదనిపించినా దానికీ, దీనికీ దీని తఱువాత రామ్‌గోపాల్‌వర్మ తీయబోయే చిత్రాలకి, అంతకు ముందు వర్మ తీసిన చిత్రాలకీ ముడి పెట్టబోను. దేని సంగతి దానిదే! మఱొక సంగతి కూడా చెప్పాలి: “వర్మ యింత కన్నా బాగా తీయగలడు” అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ, “పెట్టనమ్మ యెలాగూ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టే ముం*వి నీకేమయిం”దన్న బిచ్చగాడి సామెత చెప్పినట్టు కళాభిక్ష కోసం చూస్తున్న నాలాంటి వాడికి దర్శకుడు సరిగా తీయలేదని అతన్ని తిట్టే హక్కు మాత్రం ఉండదు. “నచ్చకపోతే చూడకండి. ఎలాగైనా చూడమని యెవడేడిసాడు?” అని వర్మయే అన్నారు ఎన్నోసార్లు.)

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:

ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:

  • ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
  • మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
  • చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
  • తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
  • తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
  • సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
  • తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.

పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)

షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.

ఇందుకా తెలంగాణా?! థూ… జీవితం!

మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారాగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.

“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:

నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుకుతూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!

సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!

సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు!

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతి భ్రమ్శాత్ బుద్ధినాశా బుద్ధినాశా పణశ్యతి

(భగవద్గీత – ఇది తెలంగాణా కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర కాదు… హర్యానాలో జఱిగింది.)

పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” అని చెప్పింది మనుస్మృతి. అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది. ఇలా అనగానే మన స్త్రీవాదులకు “మనువు” మీద మనసు మండుతుంది. మనుస్మృతి పాటించాలని అనటంలేదు. (పాటించాలంటే మఱి తద్దినపు భోజనంలో బ్రాహ్మణుడికి ఖడ్గమృగం మాంసం వడ్డించాలిట!) భారతీయ సమాజంలో అంతర్లీనంగా అంతటా ఉండే ఛాందసం అమ్మాయిలకు నయానో భయానో ఆజన్మాంతమూ సర్దుకుపోవటమే నేర్పుతుంది. ఇంట్లో వాళ్ళకెంత స్వేచ్ఛనిచ్చినా సమాజం మొత్తంలోనూ అంతటి భావవైశాల్యం లేదు కనుక యెన్నెన్నో రకాలుగా మన స్త్రీలు సర్దుకుపోవటాన్ని ఒక జీవనశైలిగా స్వీకరించటం జఱుగుతుంది. దానితో వాళ్ళు స్వచ్ఛందంగానూ ఆనందంగానూ తమ స్వాతంత్ర్యాన్ని భర్త, కుటుంబం, సమాజం వంటి బాహ్యాధిపతులకు విడిచిపెడతారు. ఇదే అన్ని సమస్యలకూ మూలమనిపిస్తుంది. మౌనమే భూషణంగా ఆధారపడటము, సర్దుకుపోవటము ఆడవాళ్ళకి అలవాటైపోయిన పరిస్థితిలోనే దోషముంది!

తనకంటూ ఒక రూపము, ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని – ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా – ఎందుకు తట్టుకోలేడు? తనలోని ప్రతి అంగము, ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు? ఏమిటి మగతనం గొప్ప? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా?! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు, ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన “ఘనత” అది. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మఱో బంధువు కావచ్చు – వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా? స్త్రీలకు రిజర్వేషన్లు “ఇవ్వటం”, స్వేచ్ఛని “ఇవ్వటం” – ఈ యివ్వటమేంటి అసలు?! ఒకరికి స్వేచ్ఛనిచ్చే “హక్కు”, “అధికారం” ఎవఱికున్నాయి?! వాళ్ళకి “ఉండవలసిన” స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా?! (ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు, శక్తిస్వరూపిణులు లేరా? హుఁ, ఉంటే మాత్రమేం లాభం? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా!) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా, మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది. ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు. అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు, కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు!

“ఉద్యోగమ్ పురుషలక్షణమ్” అన్న మాట పట్టుకుని స్త్రీలు ఉద్యోగాలు చేయరాదనేవాళ్ళు కొందఱు. సంస్కృతంలో “ఉద్యోగమ్” అంటే “ప్రయత్న”మనీ “పురుష” అన్న మాట మనుషులందఱికీ వర్తిస్తుందనీ గ్రహిస్తే “ప్రయత్నం చెయ్యటం మానవ లక్షణం” అని చెప్పారని అర్థమవుతుంది! “ఇంటికి దీపం ఇల్లాలు” అన్నది కూడా ఒక స్త్రీ వెలుగులీనే స్థాయిలో పురుషుడు వెలగలేడని అన్వయం కావచ్చు. అలాంటి దీపాలన్నీ నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న స్వార్థం భావ్యమా? స్త్రీలు యింట్లోనూ, ఉద్యోగంలోనూ రెండింటా పని వత్తిడిని తట్టుకోలేరని కొందఱి “బాధ”. ఇంట్లోనే అన్ని రకాల పనులు చెయ్యగలిగే స్త్రీ బైట మఱో పని చెయ్యలేదా?! ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు తగు సహాయమందిస్తే వత్తిడి తగ్గుతుంది కూడా! కాదా? అసలు స్త్రీ యింట్లో చేసే పనులకు విలువ కట్టగల షరాబులెవ్వఱు? ఉన్నారు… ఎవఱి జీవితాన్ని వాళ్ళే బ్రదికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తల్లులు సగటున చేస్తున్న ఇంటి పనులకు జీతంతో తూకం వేసింది ఒక సంస్థ. కొన్నేళ్ళ క్రితం చేసిన యీ పరిశోధనలో తేలిన విషయమేంటంటే జీతాలివ్వటమంటూ జఱిగితే ఒక్కో స్త్రీ చేస్తున్న పనులకి (రూపాయలలోకి మార్చితే) సంవత్సరానికి 54 లక్షల రూపాయలు ఇవ్వాలట!! అ.సం.రా దేశంలోనే అలా ఉంటే తల్లిగా/భార్యగా అన్నీ తానే అయి పని చేసే మన దేశంలో?! కనీసం ఊహించగలమా? పైగా “తల్లి ప్రేమని మించింది లే”దంటారు. స్త్రీలందఱికీ వేఱుగా “పిల్లలని ప్రేమించటమెలా?” అని పాఠాలు బోధిస్తున్నారా, లేదే? సహజసిద్ధంగా స్త్రీలలో ఉండే నిస్స్వార్థమైన ప్రేమ తల్లి ప్రేమ రూపంలో కనిపిస్తోందే కానీ వాళ్ళకి అలా ప్రేమించటానికి సమకూర్చబడిన జ్ఞానమూ, రెండో మనసూ లేవు! అది స్త్రీకి స్వతస్సిద్ధమైన లక్షణం కానప్పుడు స్త్రీలే అలా ప్రేమించగలరనుకోవటం కూడా తప్పే! తండ్రి అంతగా ప్రేమిస్తే కాదన్నదెవఱు?! మగవాడు కూడా అలా ప్రేమించలేకపోతే తండ్రి తప్పే కానీ తల్లి గొప్ప కాదు! (ప్రేమిస్తున్నామంటూ స్త్రీల వెనుక విసుగు లేకుండా తిఱిగే పురుషులు ఆ మాత్రం ప్రేమించగలరు లెండి!)

చలనచిత్రాల్లో, సాహిత్యంలో, ఇతర కళల్లో, సమాజంలో, జీవితంలో, విద్యలో, ఉద్యోగాల్లో, పెళ్ళిలో, కుటుంబంలో, ఇంట్లో… దాదాపుగా ప్రతీ చోటా మగవాళ్ళు ఆడవాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు తన జీవితంలోకి తొలి అడుగైనా వేయక ముందే తన జీవితాన్ని నిర్దేశించదలచిన మగవాడి కోసం యే ఆడదైనా యెందుకు సర్దుకుపోవాలి? తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే మఱొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక! స్త్రైణ్యం ముందు పౌరుషమెంత చిన్నబోతుందో గ్రహించి ప్రతి పురుషుడూ ఆ స్త్రైణ్యాన్ని కేవలం ఒప్పుకోవటం కాక దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అచ్చెఱువొందాలని, ఆరాధించాలని నా ప్రార్థన! మన గుఱించి మనం మఱచిపోయినా మనల్ని కనిపెట్టుకుని ఉన్న ఆ మఱొకరికి ప్రణమిల్లటం తప్పనిసరి!

స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అనీ, పురుషుడు పురుగు లాంటివాడనీ కాదు నా భావన. బేలగా కనిపించినంత మాత్రాన మన వయసు స్త్రీ మన కన్నా లోతుగా ఆలోచించగలిగి, జీవితాన్ని మన కన్నా ధైర్యంగా ఎదుర్కొనగలిగి ఆ పైన ఆ బేలతనాన్ని కూడా ఆస్వాదించగలదని మఱచిపోరాదు. మగవాడు మ్రాన్పడిపోయిన యెన్నో సందర్భాలలో – పురాణాలలో కైకేయి, సత్యభామలతో సహా – స్త్రీ సారథ్యంలోనే సమస్యలు పరిష్కరింపబడటం కద్దు. ఒక దర్శకురాలిగా (director), కార్యనిర్వహణాధికారిగా (manager), సంయామికగా (administrator), ఒక ఆర్థికవేత్తగా (economist), ఒక గురువుగా (teacher), …మగవాడి ఊహకు కూడా అందని యెన్నో రకాలుగా తన జీవితంలో విభిన్నమైన భూమికలు పోషించే స్త్రీకి నా జీవితమే జోహారుగా అర్పిస్తాను!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర – దానినిప్పుడు తెనిగించాను.)

షరా: 1. గతంలో మాతృదినోత్సవం నాడు వ్రాసిన టపాలో యిలాంటి దినాల మీద నా అభిప్రాయాన్ని పంచుకున్నాను కనుక మఱలా చెబితే చర్వితచర్వణమవుతుంది.
2. “పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు…” అన్న పంక్తి 1988వ సంవత్సరంలో విడుదలైన “ఆడదే ఆధారం” అన్న చలనచిత్రం కోసం శ్రీ సీతారామశాస్త్రి వ్రాసిన “మహిళలు మహరాణులు…” అన్న నిందాత్మక(స్తుతి)గీతంలోనిది.