Category Archives: భాష

శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
“నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?”

ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని అనిపించనంత చిరంజీవి వేటూరి! “అజరామరం” అని ఎన్నో విషయాల్లో అనాలోచితంగా అనేస్తాం! “నిజంగా జర (ముసలితనం), మరణం లేనివి ఉంటాయా?” అంటే ఉండవేమో… కానీ వేటూరి గారు మాత్రం వయసు వల్ల శరీరం వంగిపోయినా, మనసూ అందులోని భావాలు మాత్రం జరామరణాలకి అతీతంగా, ఎన్ని యేళ్ళైనా యవ్వనంతో పరవళ్ళు తొక్కుతాయనిపిస్తుంది!

“వళిభిర్ముఖమాక్రాన్తమ్ పలితేనామ్ కితమ్ శిరః గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే!”
(“మొహమంతా ముడతలు వచ్చేసాయి, తల మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం శిథిలమైపోయింది, కానీ [నాలో] తపన మాత్రం యౌవనోత్సాహంతోనే ఉంది!”) భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం వేటూరి గారికి నప్పినట్టుగా ఎవరికీ నప్పదేమో.

నేను శ్రీ  వేటూరి సుందరరామమూర్తి గారిని కలవటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. “తానా 2000” కోసమని మా యూనివర్సిటీ పట్నానికి 250 మైళ్ళ దూరంలోని డాలస్‌కి వచ్చిన వేటూరి గారిని మా చిన్న ఊరి వాస్తవ్యులైన ప్రకాశరావు గారు, కొత్తప్ప చెట్టి గారు, చెట్టి గారి శ్రీమతి లక్ష్మి గారు మా యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అప్పటికి నేను TeluguCinema.Com లో చేరి ఆరు నెలలైనా కాలేదు! అప్పటి దాకా నేను ఎవరినీ interview చెయ్యాలని, చెయ్యగలననీ అనుకోనూలేదు! అటువంటి పరిస్థితులలో వేటూరి గారిని interview చేయటానికి ఆస్కారముందా అని చెట్టిగారిని అడిగాను, శ్రీ అట్లూరి గారి ప్రోత్సాహంతో. అంతటి ఆఖరి నిముషంలో అడిగినా వేటూరి గారు వెంటనే ఒప్పుకున్నారు!

సినీపరిశ్రమలో ఎవరితోనూ కాసేపైనా నిలబడి మాట్లాడని నేను నా మొదటి interview ఏకంగా గుగ్గురువులైన వేటూరి గారినే చెయ్యాలనేసరికి అలవి కాని ఉత్సాహం! ప్రశ్నలు తయారు చేసుకుందామనే సరికి భయం మొదలైంది. వేటూరి గారు ఆహూతులైన 50-60 మంది విద్యార్థులు, కొన్ని తెలుగు కుటుంబాల వాళ్ళు ఆసక్తిగా వింటూండగా ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి మనసు విప్పి మాట్లాడుతున్న తీరుకి నాలో భయం చాలా వరకే పోయిందనిపించింది. (ఆ ఉపన్యాసం అవగానే interview చెయ్యాలి.) ఆ తరువాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసారు చెట్టి గారు, ప్రకాశరావు గారు. వెంటనే పాదాభివందనం చేసాను. నిజం ఒప్పుకోవాలంటే అందులో భక్తి కన్నా వణుకు ఎక్కువై తూలి పడతానేమో అన్నంత తడబాటు కలిగి అదే ఊపుతో ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆశీర్వదించి, భుజాలు పట్టుకుని లేపారు. తడబాటు చేతులూ కాళ్ళ నుంచి మాటకి పాకింది! ఎలాగో చెప్పాను ఆయనకి interview సంగతి. “ఓహో, మీరేనా? రండి. ఎక్కడ కూర్చుందాం?” అన్నారు. అప్పటికి నా వయసు 22! ఆ వయసులో “మీరు” అనిపించుకోవటమే ఇబ్బందికరమైతే నా కన్నా 40 యేళ్ళు పెద్దయిన పండితుడూ, యశోవంతుడు అయిన వేటూరి గారు నన్ను “మీరు” అని సంబోధించటం నా తడబాటుని మరీ పెంచేసింది. “ఇక్కడే” అని అప్పటికే అక్కడ వేసుకున్న కుర్చీలు, బల్లా చూపించి నన్ను ఏకవచనంతోనే సంబోధించమని అర్థించాను. “ఇక్కడికొచ్చి పెద్ద చదువులు చదువుతున్నారు… మర్యాద నీలోని సరస్వతికి!” అన్నారు. “స్వామీ, సరస్వతి మీలోనే ఉన్నది. నేను విద్యను అర్థిస్తున్న వాడిని.” అన్నాను. (అయినా ఆయన “మీరు” అంటూనే మాట్లాడారు చాలా వరకూ. అదీ ఆయన సంస్కారం!) ఇంతలోనే నా చేతిలో ఏదో పుస్తకం కూడా ఉండటం చూసి ఆయనకున్న అనుభవం దృష్ట్యా వెంటనే అడిగారు, “మీరు కూడా కవితలు వ్రాస్తారా?” అని. ఊహించని (సమయంలో వచ్చిన) ప్రశ్న! “పాటలు వ్రాస్తాను, పద్యాలు వ్రాయటమూ నేర్చుకుంటున్నాను. కవితలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను.” అన్నాను బెరుకుగానే. “భేష్, రచనాసరస్వతి కూడా ఉంది మీలో! …అవి చివర్లో చూద్దాం. ముందు interview కానివ్వండి” అన్నారు. చెప్పాను, నాకదే మొదటి interview అని, తప్పులు చేస్తే క్షమించమని. “నేనూ పాత్రికేయుడిగానే మొదలు పెట్టాను నా ప్రస్థానం. నువ్వూ ఆ దారిలో ఉన్నావన్న మాట! ఏమీ భయపడకు.” అని భుజం తట్టారు. ధైర్యం తెచ్చుకుని interview పూర్తి చేసాను. ఓపికగా సమాధానం చెప్పారు అన్ని ప్రశ్నలకీ. చివరగా నన్నూ మళ్ళీ ప్రోత్సహించారు మొదటిదైనా చాలా బాగా చేసానని. ఆయన మాట వరసకి అన్నారేమో తెలియదు కానీ అలా జరిగిన అంకురార్పణ తరువాత నేను TeluguCinema.Com కోసం చేసిన పదుల interviewలకు నమ్మకాన్నిచ్చే పునాది అయింది! అప్పటికి ఇంకా అప్పుడప్పుడే కలం విదిలిస్తున్న నేను ఆయనకి నా వ్రాతలు చూపించాలి అనుకోవటం సాహసమే ఒక రకంగా. (వాటిని “రచనలు” అనే సాహసం కూడా చేసే ధైర్యం లేదు అప్పటికి పూర్తిగా.) నా పిల్లవ్రాతలతో తన సమయం వృధా చేసారని గద్దిస్తారేమోనన్న భయం లోలోపల ఉండింది. అందుకే అసలు చూడమని ఆయనని ఎలా అడగాలా అని మల్లగుల్లాలు పడుతున్నాను ఆయన్ని కలిసే సరికే. అటువంటిది, ఆయనకై ఆయన నా చేతిలో పుస్తకాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పోసినట్టైంది! భయమూ తగ్గింది, నా వ్రాతల్లో పస లేకున్నా ఆయనకై ఆయనే చూస్తానన్నారు కనుక ఎక్కువగా తిట్టరేమోనని. Interview సాగుతున్న సమయంలోనే ఆయన ఎంతటి సౌమ్యులో అర్థమైంది. దానితో కోపగించుకోరని పూర్తిగా ధైర్యం వచ్చింది. Interview పూర్తయ్యాక ఆయన తన కళ్ళజోడు తెచ్చుకోలేదనీ, కనుక నన్నే నా వ్రాతలు పైకి చదవమని పురమాయించారు. మామూలుగానైతే గొంతులో పచ్చి వెలక్కాయ పడేదేమో! కానీ అప్పటికే ఆయన ఇచ్చిన ధైర్యం అచంచలమై నేనే గొంతు సవరించుకున్నాను. ఆయనకి విపించిన పద్యాలు మూడో నాలుగో. వాటిలో రెండు ఆయన మీదే వ్రాసినవని గుర్తు. (“సుందరరామ్మూర్తి గారి సొంపగు పాటల్” అన్నది ఒక పద్యం చివరి పాదమైతే “వేటూరీ, మేటివీవు విజ్ఞతనందున్” అన్నది రెండవది. పూర్తి పద్యాలు నా దగ్గర లేవు.) ఆయన విద్వత్తును మెచ్చుకుంటూ, కీర్తిస్తూ పద్యాలు వ్రాయగలిగినా అయాచితంగా వాటిని నా గొంతుతో నేనే చదివి ఆయనకి వినిపించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు! నే వినిపించిన మరో కంద పద్యం ఆయనకి చాలా నచ్చింది: “ఫ్యాషనులని నేటి యువత / భాషను ఖూనీలు జేయ భావము చచ్చెన్ / కాషను చెప్పెడు పెద్దల / ఘోషను పట్టించుకొనరు ఘోరం కాదా!” అన్నది ఆ పద్యం. “బాగా వ్రాసారు, మీరు కూడా సరైన పాళ్ళలో పరభాషా పదాలు కలుపుతూ. చక్కగా ఉంది” అన్నారు. (అప్పటికి interview లోనే పరభాషా పదాల వాడకంపై కాస్త చర్చ జరిగింది.) ఒక పాట కూడా చదివి వినిపించాను: “కొమ్మల్లో కోయిలమ్మ కొత్త పాట పాడగా, గున్నమావి చెట్టు లేత చిగురులేయగా – వసంతమొచ్చెనే ఇలకే అందమై వనములన్ని పచ్చని వెలుగు నింపగా! రావే వసంతమా, వయ్యారమై ఉగాదితో – చేసెయ్ సరాగమే పచ్చపచ్చని వనాలలో” అన్నది ఆ పల్లవి. “ఇంకొన్నేళ్ళు… అక్కర్లేదు, ఇంకొన్నాళ్ళు ఇలాగే వ్రాసినా మీరు సినిమాల్లో గీతరచయిత అయిపోవచ్చు… మీకు ఆ ఉద్దేశం ఉంటే” అన్నారు. కేవలం ప్రోత్సాహకరంగానే ఆ మాటలన్నారని ఇప్పటికీ నమ్ముతున్నా కానీ… నా ఉద్దేశాలన్నీ తెలిసినట్టు, నా మనసు చదివేసినట్టు నాకు కావలసిన ప్రోత్సాహమే ఆయన ఇవ్వటంతో నా జన్మ ధన్యమైంది! అప్పటి దాకా “గీతరచయితని కాగలనా? నాలో నిజంగానే ఒక ‘కవి’ ఉన్నాడా?” అన్న ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం లేని నా మనసులో ఒక నూత్నతేజాన్ని నింపాయి శ్రీ వేటూరి సుందరామమూర్తి గారి మాటలు!

ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ కలం కదులుతూనే ఉంది, ఆయన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే నేను అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాల పుటలు తిప్పాను. “మళ్ళీ వేటూరి గారిని కలవనేలేదు. ఇప్పటికైనా సెప్టెంబరు 8 కి ఆయనని interview చేసి పదేళ్ళైన సందర్భంగా ఈ పదేళ్ళూ ఆయన పలికిన ప్రోత్సాహపు మాటలే నా పురోగతికి ఎంతటి సహాయం చేసాయో ఆయనకి చెప్పుకుందామని, ఆయన ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులతో ఆ మాటే అన్నాను కూడా. ఇంతలోనే… ఈ వార్త!

“పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు! ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు! నువ్ పుట్టిన మన్నేరా నిన్ను తిన్నది! కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది! చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి!” …అని ఆయన మాటల్లోనే అనుకోవాలా?

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు! తరతరాలకూ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు!” …అన్న ఆయన మాటల స్ఫూర్తితోనే ముందుకు సాగిపోవాలా?

“నీ పాట ఒక్కటే నిజం లాగా / నిర్మలమైన గాలి లాగ / నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే / శుక్త మౌక్తికం లాగ … నువ్వు లేవు, నీ పాట ఉంది” …అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలే చెవుల్లో మోగుతుంటే “రాజు మరణించె, ఒక తార నేల రాలె / కవియు మరణించె నొక తార గగనమెక్కె” …అన్న జాషువా మాటల్లోని నిజాన్ని చూసి సంతోషించాలా?

“జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువమ్ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వమ్ శోచితుమర్హసి” …అని గీతాకారుడు చెప్పినది సబబే! (పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.) ఎందుకంటే, భర్తృహరి అన్నట్టు కవుల యశస్సు (అనే శరీరం) జరామరణాల భయానికి అతీతమైనది!

“జయన్తి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి యేషామ్ యశఃకాయే నాస్తి జరామరణజమ్ భయమ్!” – నిజమే, కళాకారులకు మరణం లేదు! ముఖ్యంగా కవులకు! అతిముఖ్యంగా శ్రీ వేటూరి సుందరరామమూర్తి వంటి కవికి – తెలుగు సినీజగత్తులో అతి సాధారణ సందర్భాల్లో వచ్చే పాటల్లో కూడా కవిత్వం గుప్పించి మెప్పించవచ్చని నిరూపించి సజీవతార్కాణంగా తరతరాలకూ దిక్సూచిగా నిలబడిన మనీషికి!

కనబడుట లేదు!

పేరు: చాంచల్యం కరిగిన బాల్యం!
గుర్తులు:
తప్పిపోయిన సమయంలో స్వచ్ఛమైన మనసు తొడుక్కుని ఉంది,
మనిషితనం తప్పించి మరే భాషా రాదు,
మనసు భాష కొంచెం అర్థం చేసుకోగలదు
“పైకి తెలియకపోయినా
అందరూ నిన్నే వెతుకుతున్నారు…
నీవు వెళ్ళినప్పటి నుంచి
బ్రతుకుతల్లి నవ్వుని మరచిపోయింది!
వచ్చెయ్యి, నిన్ను నన్నుగా చేసుకుంటా!”

ఏంటి, పదేళ్ళా…!

నిజమే…
క్యాలెండర్‌లో “20” తరువాత
“0” కాస్తా “1” అయింది!
“ఒకటి”కి ఎంత విలువనో కదా!అబ్బే పదేళ్ళేనా…
ఎంతో నేర్పించింది జీవితం…
చేరదీసి తట్టి, చాచి పెట్టి కొట్టి
చాలానే నేర్పింది జీ..వి..తం!
నేనే… ఏమీ నేర్చుకోలేదు!విదేశంలో పదేళ్ళున్నానంటే…
“ఆహా!” అన్నవాళ్ళే అంతా!
“అయ్యో” అనుండాలని ఎందరికి తెలుసు!?
తల్లిభూమి చేదయ్యిందా?అదేంటో…
మనసు బ్రతికే ఉంది …ఇంకా!
కన్నీళ్ళూ నేలలోకి ఇంకుతూనే ఉన్నాయి …ఇంకా!
మధురమైన మట్టి వాసన మరి
తట్టి లేపదేం మనసును?
మనసు బ్రతికే …ఉందంటావా?!ఎవరెవరో పలకరించారు,
ప్రేమ పన్నీరు చిలకరించారు,
ప్రేమ పైననే చితులు పేర్చారు,
“ఆత్మ నాశనము లేనిది” అని కృష్ణుడు చెప్పలేదూ!?
ప్రేమ మాత్రం తక్కువ తిన్నదా?ఎన్నెన్ని జరిగాయో…
ఏం జరిగితేనేం…
అంతా అలాగే ఉంది…
నే..ను తప్పించి
అం..తా అ..లా..గే…!గడిచిన పదేళ్ళలో…
నా వయసు ఎన్నేళ్ళు పెరిగిందో,
నా మనసు ఎన్నాళ్ళు మరిగిందో,
నా కలలు ఎన్నెన్ని కరిగాయో,
ఏ మార్పులెందుకని జరిగాయో…
తెలుసుకోవటానికి ఆగే అవసరం లేకుండా
జీవితం ఎలాగోలా సాగుతూనే ఉంది…
హమ్మయ్య!

(అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా…)

నేడు తెలుగు భాషా దినోత్సవం

(తొలుత “ఆర్కుట్”లోని ఒక కూటమిలో వ్రాసిన యీ టపాని తగుమాత్రంగా దిద్ది యిక్కడ ఉంచుతున్నాను.)

మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం!

ప్రతి భాషకు “మనుగడ ప్రశ్నార్థకమే” అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న మన భాష బావుటా వెలవెలబోయే పరిస్థితి కనీసం మన తరం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులోని “రుచి” మారదు, కాలుష్యం పెరగదు, అడుగంటిపోదు! (మధురమైన భాషను ఉప్పు నీటి సముద్రంతో పోల్చటం అనౌచిత్యమే కావచ్చు కానీ “రుచి” అన్నది “స్వధర్మం” అన్న అర్థంలో తీసుకోమని మనవి. మరో సంగతి: రుచి అన్న పదానికి “ఉప్పు” అన్న అర్థం కూడా ఆపాదించబడింది

శాస్త్ర/సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific/technical jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికి కావలసింది ఆ భాషకు “దినం” పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషించటంతో భాషకు కొత్త ఊపిరులు పోసుకోదు నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మాత్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! (నేను తెలుగులోనే సంబోధిస్తానని మనవి.) ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంతరీకరణలు (transformations), యుద్ధాలు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాషకు మన రోజువారీ సంభాషణలే ప్రాణవాయువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి ఉంది… అది ఎంత మంది చేస్తున్నాము?! “అదేంటి?” అంటారా? తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని/అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం – “ఇవి చేస్తున్నామా?” అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న! “ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు” అన్న సామెత మనదే! దురదృష్టవశాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! …నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్ఠం చేయటం ఎంత అవసరమో కాలానుగతంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ “ఎప్పుడో బళ్ళో చదువుకుని వదిలేసిన సంగతులు”! సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు అనవసర కష్టాలు

మనకు “పుస్తకాలు చదవటం bore”, ప్రాచీన కళలైన “సాంప్రదాయక సంగీతనృత్యాలు slow” వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. (వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ, చర్చించటమూ మానేసామని!) అదేంటో… ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది “మన సంగీతం slow” అన్న మాట వింటే! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని, స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు “విమర్శకు”లకు తెలియదు కాబోలు! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు… కానీ, ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం!

మన వాళ్ళకు ఉండే మరో జాడ్యం “గొప్పలు చెప్పుకోవటం”! బొట్టు పెట్టుకోవటం మన సంప్రదాయం, అందరికీ నమస్కరించటం మన సంప్రదాయం, తెలుగు భాష తీయనైనది… ఇలా ఎన్నైనా చెబుతాం. ఎందుకు “గొప్ప” అంటే ఇదమిత్థంగా చెప్పలేక తడబడతాం! “గొప్ప” అని తెలిసి అందరికీ చెప్పుకోవాలనిపించటం తప్పు కాదు కానీ ఎందుకు గొప్ప అన్నది తెలుసుకునే జిజ్ఞాస లేని జాతి మనది అన్నది నిష్ఠురసత్యం! “దేశభాషలందు తెలుగు లెస్స” అని చెప్పుకుని గర్వపడతామే కానీ అక్కడ “దేశం” అంటే వేల భాషలకు ఆలవాలమైన భారతదేశం కాదని, అప్పట్లో ఉన్నది చిన్నా చితకా రాజ్యాలేనని గ్రహించము! మాతృభాష అన్నది ఒక గొప్పతనంగా భావిస్తామే కానీ ఆ కాలంలో ఆయా రాజ్యాల ప్రజలందరూ పొరుగు రాజ్యాల భాషలు నేర్చుకునేవారని గ్రహించము! మన భాష అతి ప్రాచీనమైనదని చెప్పుకుని అందుకు ఉన్నవీ, లేనివీ ఆధారాలు కల్పించుకుంటాం! తమదే ప్రాచీనభాష అన్నందుకు తమిళులని తప్పు పడతాం! అంతే కానీ, నిజంగానే తమిళభాష తెలుగు కన్నా ముందే పుట్టిందేమోనని, కనీసం దాని లిపి దాదాపు 1500 యేళ్ళుగా మారలేదని మనం గ్రహించుకోము!

…తెలుగు భాషను కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు! విశ్లేషణాత్మక/విమర్శనాత్మక/తార్కిక దృక్పథాలు కరువై, ఇలాంటి పదాలే బరువైన మన తరానికి తెలుగు భాషని అంతమొదించేంతటి సత్తువ లేదు! తెలుగు భాషను ప్రాణప్రదంగా పూజించేవాళ్ళకు కొదువా లేదు! మనకు పార్శ్వపు అంధత్వం (selective blindness), పార్శ్వపు మతిమరపు (selective amnesia) ఉండటమూ, మన భాషాసంస్కృతుల పట్ల మనకు అవగాహన, అభిమానము లేకపోవటము వంటి ఎన్నో కారణాలు మనమే అనునిత్యం పరీక్షించుకుని మనలని మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది… అది కూడా మన అవసరమేనని గ్రహిస్తే చాలు – అదే తెలుగు భాషకు పదివేలు, భావి తరాలకు మనం చేసే మేలు! (పార్శ్వం అంటే selective కాదు… “ఒక వైపు” అని మాత్రమే. కనుక దీనిని సందర్భోచితమైన అనుసరణగానే స్వీకరించానే తప్పించి నిక్కచ్చి అనువాదం కాదు.)

కొన్ని వివరణలు:

  1. ఆముక్తమాల్యద”లోనిదిగా ప్రముఖమైన “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వ్యాఖ్య కృష్ణదేవరాయలే రచించినట్టు నమ్మితే “దేశం” అన్న పదం “విజయనగర సామ్రా”జ్యాన్ని సూచిస్తుంది. కానీ, శ్రీనాథుడిదిగా చెప్పబడుతున్న “జనని సంస్కృతంబు సకల భాషలకును / దేశభాషలందు తెలుగు లెస్స / …” అన్న ఆటవెలది పద్యం ఒకటి ఉంది. కానీ, ఏది ముందు వ్రాసినదో ఇదమిత్థంగా తెలియదు! మన కవులు తమకు తాము తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వలనేనేమో… వారి గురించిన విషయాలు వారి రచనల్లో ఎక్కువగా కనిపించవు. అందుకని వారి దేశకాలాలను మనం నిర్ధారించలేని స్థితిలో ఉన్నాము. ఈ విషయాలేవీ మనలో చాలా మందికి తెలియదు! తెలిసినా కూడా పరిశోధించే ఉద్దేశము, పరిశీలించే ఉత్సుకత లేవు చాలా మందిలో!
  2. తమిళులు చేసిన స్వార్థపుటన్యాయం వేరే ఉంది: తమిళభాష ప్రాచీనమైనదని ప్రభుత్వం తీర్మానించిన వెంటనే ప్రాచీనభాషలను గుర్తించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కాలవ్యవధిని 2000 సంవత్సరాలకు పెంచటం!
    3. మన భాషకు లిపి నేటి స్థాయికి చేరినది ఎప్పుడో తెలుసా? ముద్రణ యంత్రాలు మన దేశానికి వచ్చిన తరువాత – అంటే 19వ శతాబ్దంలో!

హాసం – ఒక పత్రిక పతనం

హాసం – హాస్యము, సంగీతము ముఖ్యాంశాలుగా గత కొన్నేళ్ళుగా ఆంధ్రులను అలరించిన పత్రిక. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదివేవాళ్ళు ఆ పక్షపత్రికని. వాళ్ళలో కొందరు చాలా కాలం క్రితమే పత్రికలు చదివే అలవాటు పోయిన వాళ్ళు. అయితేనేం, హాసం అందరినీ అలరించేది. అయినా అది ఈనాటి వాణజ్య ప్రపంచంలో నిలవలేక…పోయింది. అంత మంది చందాదారులున్నా, మరి కొందరయినా అప్పుడప్పుడూ కొనేవాళ్ళున్నా, కాగితం నాణ్యత మరీ గొప్పగా లేకపోయినా ఈ పత్రిక ఎందుకు ఆగిపోవలసివచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం లేదు, రాదు. తప్పు పాఠకులదా, సంపాదకులదా, పత్రికలదా, ప్రపంచానిదా ఎవరూ చెప్పలేరు.