Tag Archives: వేదాంతం

శివోహమ్

అసంభవమై,
ప్రళయకాల జృంభణమై,
లయమే తన లయగా
భూనభోంతరాళాలు ఏకమయ్యేలా
చెలరేగిన కరాళ నృత్యం –
అస్తవ్యస్తమైన ఆంగికంతో
తెలియని సంయోగాన్ని సాధించే యత్నం…
చిరపరిచిత అభ్యాసం,
స్వరపరచని విన్యాసం!
విలయకారుని సాన్నిధ్యంలో
సమయపాలన సరి నైవేద్యం!

లయబద్ధమైన ప్రతి అడుగూ
అహంభావాన్ని దూరం చేస్తూ
విలయమే ఆవహించినట్టు
స్వయంగా సమర్పితమౌతూ
అప్రయత్నంగా
అన్యోన్యత నాహ్వానిస్తూ
అనాలోచితంగా
అధిదేవుని కంకితమౌతూ…

శంకరుని స్వేదామృతగీతాలే
జగన్మాత క్షీరోధృతిపాతాలై,
మనశ్శాంతి సంకేతాలై,
అచంచల విశ్వాసాలై,
లోకనాథుని నిశ్వాసాలై,
శివకరుణాదృక్‌శీకరాలే
సర్వేంద్రియ వశీకరాలై…
స్పందించే జగత్సమస్తం
మౌనాశ్రిత సమ్మోహితం!

పదఘట్టన లేదు,
నవజాతశిశువు లాస్యం తప్ప!
కనులు తెరిచిన తొలి సంభ్రమం –
అస్తిత్వంలో నాస్తి యైనట్టు
భువనఘోషలో చిరు కూడిక –
తుది శ్వాసలోని జీవమే
పరమాద్భుతమైనట్టు…
ఇక నృత్యం లేదు,
ఉచ్ఛ్వాసం లేదు,
సశరీర సాక్ష్యం లేదు,
అత్యుత్తమ జ్ఞానం లేదు,
ఐక్యమయ్యే కారణం లేదు!
ఉన్నది …ఒక్కటే!

(మూలం: <http://parnashaala.blogspot.com/2009/05/blog-post.html> వద్ద మహేశ్ గారు ఉటంకించిన శేఖర్ కపూర్ విరచిత ఆంగ్లకవిత “Dancing with Shiva”.)

షరా: ఆ పుటలోనే ఉన్న మహేశ్ గారి తెలుగు సేత కానీ వ్యాఖ్యాల్లో కనిపించే రేరాజు గారి ప్రయత్నం కానీ ఈ కవితకు మూలం కాదు. అన్నీ ఒకే కవితకు అనుసృజనలు/అనువాదాలు కనుక కొన్ని పదాలు, భావాలు ఒకేలా అనిపించవచ్చు. మూలం కన్నా నాకు మహేశ్ గారి ప్రయత్నమే నచ్చింది. కానీ, చాలా వరకూ సరళమైన భాషతోనే చేసిన మహేశ్ గారి అనువాదంలో యేదో లోపించిందన్న భావన కలిగింది. “చక్కని అనువాదం. కానీ, మరింత చిక్కగా ఉండి ఉండవచ్చు.” అన్న వ్యాఖ్య వారి ఫేస్‌బుక్ గోడ మీద వ్రాసాక నేనూ ప్రయత్నించాలనిపించింది. (రేరాజు గారి అనువాదం చూసే లోపే నేను వ్రాద్దామని నిర్ణయించుకున్నాను కనుక ఆయన అనువాదం నేను “చూసాను” కానీ చదవలేదు.) నా అనువాదం న్యాయం చేసిందని నేను అనుకోవటంలేదు. నిజానికి ఇప్పుడు చూస్తే నా అనువాదం చిక్కగా ఉంది కానీ, చక్కగా లేదనే నా అనుమానం. కానీ, ఒకే ఆంగ్లమూలానికి మూడు అనువాదాలు చదివే అవకాశం ఎప్పుడో కానీ రాదు కనుక ఆ ఉద్దేశమైనా నెరవేరుతుందని నా ఊహ.

శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
“నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?”

ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని అనిపించనంత చిరంజీవి వేటూరి! “అజరామరం” అని ఎన్నో విషయాల్లో అనాలోచితంగా అనేస్తాం! “నిజంగా జర (ముసలితనం), మరణం లేనివి ఉంటాయా?” అంటే ఉండవేమో… కానీ వేటూరి గారు మాత్రం వయసు వల్ల శరీరం వంగిపోయినా, మనసూ అందులోని భావాలు మాత్రం జరామరణాలకి అతీతంగా, ఎన్ని యేళ్ళైనా యవ్వనంతో పరవళ్ళు తొక్కుతాయనిపిస్తుంది!

“వళిభిర్ముఖమాక్రాన్తమ్ పలితేనామ్ కితమ్ శిరః గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే!”
(“మొహమంతా ముడతలు వచ్చేసాయి, తల మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం శిథిలమైపోయింది, కానీ [నాలో] తపన మాత్రం యౌవనోత్సాహంతోనే ఉంది!”) భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం వేటూరి గారికి నప్పినట్టుగా ఎవరికీ నప్పదేమో.

నేను శ్రీ  వేటూరి సుందరరామమూర్తి గారిని కలవటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. “తానా 2000” కోసమని మా యూనివర్సిటీ పట్నానికి 250 మైళ్ళ దూరంలోని డాలస్‌కి వచ్చిన వేటూరి గారిని మా చిన్న ఊరి వాస్తవ్యులైన ప్రకాశరావు గారు, కొత్తప్ప చెట్టి గారు, చెట్టి గారి శ్రీమతి లక్ష్మి గారు మా యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అప్పటికి నేను TeluguCinema.Com లో చేరి ఆరు నెలలైనా కాలేదు! అప్పటి దాకా నేను ఎవరినీ interview చెయ్యాలని, చెయ్యగలననీ అనుకోనూలేదు! అటువంటి పరిస్థితులలో వేటూరి గారిని interview చేయటానికి ఆస్కారముందా అని చెట్టిగారిని అడిగాను, శ్రీ అట్లూరి గారి ప్రోత్సాహంతో. అంతటి ఆఖరి నిముషంలో అడిగినా వేటూరి గారు వెంటనే ఒప్పుకున్నారు!

సినీపరిశ్రమలో ఎవరితోనూ కాసేపైనా నిలబడి మాట్లాడని నేను నా మొదటి interview ఏకంగా గుగ్గురువులైన వేటూరి గారినే చెయ్యాలనేసరికి అలవి కాని ఉత్సాహం! ప్రశ్నలు తయారు చేసుకుందామనే సరికి భయం మొదలైంది. వేటూరి గారు ఆహూతులైన 50-60 మంది విద్యార్థులు, కొన్ని తెలుగు కుటుంబాల వాళ్ళు ఆసక్తిగా వింటూండగా ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి మనసు విప్పి మాట్లాడుతున్న తీరుకి నాలో భయం చాలా వరకే పోయిందనిపించింది. (ఆ ఉపన్యాసం అవగానే interview చెయ్యాలి.) ఆ తరువాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసారు చెట్టి గారు, ప్రకాశరావు గారు. వెంటనే పాదాభివందనం చేసాను. నిజం ఒప్పుకోవాలంటే అందులో భక్తి కన్నా వణుకు ఎక్కువై తూలి పడతానేమో అన్నంత తడబాటు కలిగి అదే ఊపుతో ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆశీర్వదించి, భుజాలు పట్టుకుని లేపారు. తడబాటు చేతులూ కాళ్ళ నుంచి మాటకి పాకింది! ఎలాగో చెప్పాను ఆయనకి interview సంగతి. “ఓహో, మీరేనా? రండి. ఎక్కడ కూర్చుందాం?” అన్నారు. అప్పటికి నా వయసు 22! ఆ వయసులో “మీరు” అనిపించుకోవటమే ఇబ్బందికరమైతే నా కన్నా 40 యేళ్ళు పెద్దయిన పండితుడూ, యశోవంతుడు అయిన వేటూరి గారు నన్ను “మీరు” అని సంబోధించటం నా తడబాటుని మరీ పెంచేసింది. “ఇక్కడే” అని అప్పటికే అక్కడ వేసుకున్న కుర్చీలు, బల్లా చూపించి నన్ను ఏకవచనంతోనే సంబోధించమని అర్థించాను. “ఇక్కడికొచ్చి పెద్ద చదువులు చదువుతున్నారు… మర్యాద నీలోని సరస్వతికి!” అన్నారు. “స్వామీ, సరస్వతి మీలోనే ఉన్నది. నేను విద్యను అర్థిస్తున్న వాడిని.” అన్నాను. (అయినా ఆయన “మీరు” అంటూనే మాట్లాడారు చాలా వరకూ. అదీ ఆయన సంస్కారం!) ఇంతలోనే నా చేతిలో ఏదో పుస్తకం కూడా ఉండటం చూసి ఆయనకున్న అనుభవం దృష్ట్యా వెంటనే అడిగారు, “మీరు కూడా కవితలు వ్రాస్తారా?” అని. ఊహించని (సమయంలో వచ్చిన) ప్రశ్న! “పాటలు వ్రాస్తాను, పద్యాలు వ్రాయటమూ నేర్చుకుంటున్నాను. కవితలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను.” అన్నాను బెరుకుగానే. “భేష్, రచనాసరస్వతి కూడా ఉంది మీలో! …అవి చివర్లో చూద్దాం. ముందు interview కానివ్వండి” అన్నారు. చెప్పాను, నాకదే మొదటి interview అని, తప్పులు చేస్తే క్షమించమని. “నేనూ పాత్రికేయుడిగానే మొదలు పెట్టాను నా ప్రస్థానం. నువ్వూ ఆ దారిలో ఉన్నావన్న మాట! ఏమీ భయపడకు.” అని భుజం తట్టారు. ధైర్యం తెచ్చుకుని interview పూర్తి చేసాను. ఓపికగా సమాధానం చెప్పారు అన్ని ప్రశ్నలకీ. చివరగా నన్నూ మళ్ళీ ప్రోత్సహించారు మొదటిదైనా చాలా బాగా చేసానని. ఆయన మాట వరసకి అన్నారేమో తెలియదు కానీ అలా జరిగిన అంకురార్పణ తరువాత నేను TeluguCinema.Com కోసం చేసిన పదుల interviewలకు నమ్మకాన్నిచ్చే పునాది అయింది! అప్పటికి ఇంకా అప్పుడప్పుడే కలం విదిలిస్తున్న నేను ఆయనకి నా వ్రాతలు చూపించాలి అనుకోవటం సాహసమే ఒక రకంగా. (వాటిని “రచనలు” అనే సాహసం కూడా చేసే ధైర్యం లేదు అప్పటికి పూర్తిగా.) నా పిల్లవ్రాతలతో తన సమయం వృధా చేసారని గద్దిస్తారేమోనన్న భయం లోలోపల ఉండింది. అందుకే అసలు చూడమని ఆయనని ఎలా అడగాలా అని మల్లగుల్లాలు పడుతున్నాను ఆయన్ని కలిసే సరికే. అటువంటిది, ఆయనకై ఆయన నా చేతిలో పుస్తకాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పోసినట్టైంది! భయమూ తగ్గింది, నా వ్రాతల్లో పస లేకున్నా ఆయనకై ఆయనే చూస్తానన్నారు కనుక ఎక్కువగా తిట్టరేమోనని. Interview సాగుతున్న సమయంలోనే ఆయన ఎంతటి సౌమ్యులో అర్థమైంది. దానితో కోపగించుకోరని పూర్తిగా ధైర్యం వచ్చింది. Interview పూర్తయ్యాక ఆయన తన కళ్ళజోడు తెచ్చుకోలేదనీ, కనుక నన్నే నా వ్రాతలు పైకి చదవమని పురమాయించారు. మామూలుగానైతే గొంతులో పచ్చి వెలక్కాయ పడేదేమో! కానీ అప్పటికే ఆయన ఇచ్చిన ధైర్యం అచంచలమై నేనే గొంతు సవరించుకున్నాను. ఆయనకి విపించిన పద్యాలు మూడో నాలుగో. వాటిలో రెండు ఆయన మీదే వ్రాసినవని గుర్తు. (“సుందరరామ్మూర్తి గారి సొంపగు పాటల్” అన్నది ఒక పద్యం చివరి పాదమైతే “వేటూరీ, మేటివీవు విజ్ఞతనందున్” అన్నది రెండవది. పూర్తి పద్యాలు నా దగ్గర లేవు.) ఆయన విద్వత్తును మెచ్చుకుంటూ, కీర్తిస్తూ పద్యాలు వ్రాయగలిగినా అయాచితంగా వాటిని నా గొంతుతో నేనే చదివి ఆయనకి వినిపించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు! నే వినిపించిన మరో కంద పద్యం ఆయనకి చాలా నచ్చింది: “ఫ్యాషనులని నేటి యువత / భాషను ఖూనీలు జేయ భావము చచ్చెన్ / కాషను చెప్పెడు పెద్దల / ఘోషను పట్టించుకొనరు ఘోరం కాదా!” అన్నది ఆ పద్యం. “బాగా వ్రాసారు, మీరు కూడా సరైన పాళ్ళలో పరభాషా పదాలు కలుపుతూ. చక్కగా ఉంది” అన్నారు. (అప్పటికి interview లోనే పరభాషా పదాల వాడకంపై కాస్త చర్చ జరిగింది.) ఒక పాట కూడా చదివి వినిపించాను: “కొమ్మల్లో కోయిలమ్మ కొత్త పాట పాడగా, గున్నమావి చెట్టు లేత చిగురులేయగా – వసంతమొచ్చెనే ఇలకే అందమై వనములన్ని పచ్చని వెలుగు నింపగా! రావే వసంతమా, వయ్యారమై ఉగాదితో – చేసెయ్ సరాగమే పచ్చపచ్చని వనాలలో” అన్నది ఆ పల్లవి. “ఇంకొన్నేళ్ళు… అక్కర్లేదు, ఇంకొన్నాళ్ళు ఇలాగే వ్రాసినా మీరు సినిమాల్లో గీతరచయిత అయిపోవచ్చు… మీకు ఆ ఉద్దేశం ఉంటే” అన్నారు. కేవలం ప్రోత్సాహకరంగానే ఆ మాటలన్నారని ఇప్పటికీ నమ్ముతున్నా కానీ… నా ఉద్దేశాలన్నీ తెలిసినట్టు, నా మనసు చదివేసినట్టు నాకు కావలసిన ప్రోత్సాహమే ఆయన ఇవ్వటంతో నా జన్మ ధన్యమైంది! అప్పటి దాకా “గీతరచయితని కాగలనా? నాలో నిజంగానే ఒక ‘కవి’ ఉన్నాడా?” అన్న ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం లేని నా మనసులో ఒక నూత్నతేజాన్ని నింపాయి శ్రీ వేటూరి సుందరామమూర్తి గారి మాటలు!

ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ కలం కదులుతూనే ఉంది, ఆయన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే నేను అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాల పుటలు తిప్పాను. “మళ్ళీ వేటూరి గారిని కలవనేలేదు. ఇప్పటికైనా సెప్టెంబరు 8 కి ఆయనని interview చేసి పదేళ్ళైన సందర్భంగా ఈ పదేళ్ళూ ఆయన పలికిన ప్రోత్సాహపు మాటలే నా పురోగతికి ఎంతటి సహాయం చేసాయో ఆయనకి చెప్పుకుందామని, ఆయన ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులతో ఆ మాటే అన్నాను కూడా. ఇంతలోనే… ఈ వార్త!

“పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు! ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు! నువ్ పుట్టిన మన్నేరా నిన్ను తిన్నది! కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది! చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి!” …అని ఆయన మాటల్లోనే అనుకోవాలా?

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు! తరతరాలకూ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు!” …అన్న ఆయన మాటల స్ఫూర్తితోనే ముందుకు సాగిపోవాలా?

“నీ పాట ఒక్కటే నిజం లాగా / నిర్మలమైన గాలి లాగ / నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే / శుక్త మౌక్తికం లాగ … నువ్వు లేవు, నీ పాట ఉంది” …అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలే చెవుల్లో మోగుతుంటే “రాజు మరణించె, ఒక తార నేల రాలె / కవియు మరణించె నొక తార గగనమెక్కె” …అన్న జాషువా మాటల్లోని నిజాన్ని చూసి సంతోషించాలా?

“జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువమ్ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వమ్ శోచితుమర్హసి” …అని గీతాకారుడు చెప్పినది సబబే! (పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.) ఎందుకంటే, భర్తృహరి అన్నట్టు కవుల యశస్సు (అనే శరీరం) జరామరణాల భయానికి అతీతమైనది!

“జయన్తి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి యేషామ్ యశఃకాయే నాస్తి జరామరణజమ్ భయమ్!” – నిజమే, కళాకారులకు మరణం లేదు! ముఖ్యంగా కవులకు! అతిముఖ్యంగా శ్రీ వేటూరి సుందరరామమూర్తి వంటి కవికి – తెలుగు సినీజగత్తులో అతి సాధారణ సందర్భాల్లో వచ్చే పాటల్లో కూడా కవిత్వం గుప్పించి మెప్పించవచ్చని నిరూపించి సజీవతార్కాణంగా తరతరాలకూ దిక్సూచిగా నిలబడిన మనీషికి!

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)