Category Archives: సమాజం

మన “వాళ్ళు” సాధించారు… మఱి మనం?

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం!” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని పాటలో వ్రాసినట్టు అనుమానాస్పదరీతిలో మొదలైనా గెలుపును అందుకోవటానికి తగిన విజిగీష (zeal) కనిపించింది “టీమ్ ఇండియా” ఆటగాళ్ళలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో! ఆ తపనకు “సాహో” అనుకుని గెలుపు మీద నమ్మకంతో కళ్ళారా నిద్రపోయాను నిన్న రాత్రి. (నిద్ర మధ్యలో 274/6 అన్న స్కోర్ చూసాక మఱీ సుఖంగా పట్టింది నిద్ర.) విజయమెపుడూ అనాయాస విలాసం కాదనీ, అకుంఠిత దీక్ష ఫలితమేనని గుర్తు చేసే ఉత్కంఠను రేపిన పోటీ యని నిద్ర లేచాకనే తెలిసింది.

…నిజానికి నేను క్రికెట్‌నే కాదు, ఏ క్రీడావళినీ (tournament) పెద్దగా అనుసరించను. అక్కడెక్కడో యెవఱో ఆడుతుంటే యిక్కడ నేను నా పని మానుకుని చూసేదేమిటన్న అలక్ష్యమది. “బోడి చదువులు వేస్టు, నీ బుఱ్ఱంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని గురువుగారు వ్రాసినా “క్రీడల్లోనైనా స్ఫూర్తిమంతులుగా, విజయార్హులుగా ఉండా”లనే చెప్పిన సూత్రమేనని గ్రహించాను తప్పితే గురువాక్యంగా స్వీకరించి నాది తప్పనుకోలేదు. (ఆ స్ఫూర్తితోనే నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గీతరచనలోనూ, తెలుగుసినిమా.కామ్ జాలగూటి కోసం వ్యాసాలు, సమీక్షలు, తదితరరచనావ్యాపకంగా మళ్ళించానని యీ సందర్భంగా ప్రస్తావించటం సముచితం.) 1983 ప్రపంచ కప్ క్రికెట్ క్రీడావళి సమయానికి నాకు ఊహ తెలిసినా అప్పట్లో ప్రసారమాధ్యమాలు యింత విరివిగా లేవు. అప్పటికి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టలేదు. (అప్పటికి నాకు ఐదేళ్ళు.) ఆ తఱువాతి ప్రపంచ కప్ క్రీడావళులు (1987, రిలయన్స్ కప్; 1992, బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్) మాత్రం చాలా వఱకు అనుసరించాను, ముఖ్యంగా 1987 నాటికి క్రికెట్ ఆడేవాడిని కనుక. (1992 నాటికి దాదాపుగా ఆపేసానని చెప్పాలి.) ఈ కారణాల వలన కూడా క్రికెట్ లేద్దా మఱో క్రీడ – ముఖ్యంగా “ప్రేక్షక క్రీడలు” (“spectator sports” అని మా అన్న సూచించిన పదబంధం) – మనిషిలో నింపే స్థైర్యం, ఎదుగుదల లాంటివి నాకు పరిచయం లేదని ఒప్పుకోవాలి. (1985-’86 ప్రాంతాల్లో యండమూరి వ్రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో నాయకుడు రేవంత్ ప్రపంచవిజేతను చదరంగం ఆటలో ఓడించి స్వదేశానికి వచ్చిన సందర్భంలో తన ఆప్తమిత్రుడు జేమ్స్‌తో ఒక సంభాషణ కనిపిస్తుంది: “…నీకు తెలుసా, జేమ్స్? కనీసం ప్రాంతీయ క్రీడామండలి సెక్రెటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు.” “కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా?” – “కాదు, తెలుగువాడిని కావటం” అన్న జవాబిప్పుడు అప్రస్తుతం – ఆ సంభాషణలోని వాస్తవం కూడా ఒక కారణం నాకు క్రికెట్ అంటే చిన్న చూపు యేర్పడటానికి. అతిప్రాచుర్యం (Hype) కల్పించినదాని పట్ల విముఖత నాలో చిన్నపుడే మొదలయిందనటానికి యిదొక నిదర్శనం.)

ఈ ఉపోద్ఘాతమంతా యెందుకంటే యీసారి ప్రపంచ కప్ టీమ్ ఇండియాదేనని మొదటి నుంచీ నాకెందుకో నమ్మకంగా ఉండింది. (క్రికెట్‌ని తదేకంగా అనుసరించకపోవటం వలన కూడా నాకీ నమ్మకం కలిగి ఉండవచ్చు.) మొదట్లో కొంత పడుతూ లేస్తూ సాగినా ఓటమినెఱుగని రీతిలో సాగటం నిర్ద్వంద్వంగా నా నమ్మకాన్ని పెంచింది. ప్రపంచ కప్ క్రీడావళి మొదలైనప్పుడే (నాకు క్రికెట్ పట్ల ఆసక్తి పెద్దగా లేదని అప్పటికి అతనికి తెలియక) భారత క్రీడాకారచయం (team) అభిమానుల ఆశలను ప్రతిబింబించేలా నేనొక గీతం వ్రాస్తే దృశ్యకం (video) తయారుచేద్దామనుకుంటున్నానని ఒక దర్శక-మిత్రుడు అడిగాడు. అప్పటి నుంచి కొద్దో గొప్పో ఆసక్తితో అనుసరించాను యీ క్రీడావళినీ, ఆటగాళ్ళ పాత్రపోషణను. నిజానికి పల్లవి వఱకు వ్రాసిన తఱువాత ఆ గీతదృశ్యక రూపకల్పన సాధ్యం కాదని తేలినా ఆ పల్లవి మాత్రం పదేపదే నా నమ్మకానికి రూపంగా నిలిచింది. ప్రఖ్యాత బ్రెజిల్ రచయిత పాలో కొయెలో చెప్పిన ఒక సూక్తిని తెనిగిస్తూ వ్రాసిన ఆ పల్లవి యిదీ:

కోట్ల మందికి ప్రతినిధులుగా మీరు నిలిచిన ఆటలో
కోరి వళ్డ్ కప్ తీసుకొస్తారంటు గెలిచే ఆశతో
మది నమ్మిన విజయం కోసం ప్రతి అడుగూ అంకితమైతే
మన ఱేపటి ఉదయం కోసం జగమంతా వెలుగులనీదా!

ఇన్నేళ్ళ కల నిజమవ్వాలని మీ వెంటుందిలా యీ భరతావని!

పాలో కొయెలో రచనలు నేను చదవలేదు, కానీ నా సొంత సూక్తి ఒకటి ఉంది యిలాంటిదే: “మన నిశ్చయాన్ని నిజం చేయటం కన్నా విధికి మఱో యెంపిక లేదు!” (“Fate has no choice than to realize what we determine.”). నా దృష్టిలో టీమ్ ఇండియా సాధించిన యీ విజయానికి కారణం జట్టులోని ఆటగాళ్ళందఱూ త్రికరణశుద్ధిగా అలాంటి సూక్తుల అంతరార్థాన్ని, స్వప్నమాత్రంగా ఉన్న యీ విజయాన్ని “నమ్మటం”… అదీ గత ప్రపంచ కప్ క్రీడావళి అనుభవం నేర్పిన పాఠాలను నిరంతరం స్మరించుకుని నాటి ఉన్మాదాత్మక అభిమానుల ఆగ్రహజ్వాలలో తమ స్థైర్యానికి చితి పేర్చకపోవటం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. (వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే ఉన్న “విజయమా విజయమా – వస్తూ శిఖరాన్నెక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు…” అన్న వాక్యం యీ సందర్భంగా గమనార్హం. శ్రీశ్రీ వ్రాసిన ఆఁ.. అన్న కవిత కూడా.)

టెండూల్కర్‌కి నేను అభిమానిని కాను. కారణం పైన పేర్కొన్నట్టు అతనికి అందఱూ యిచ్చే అతిప్రాచుర్యమే. కానీ, కేవలం తన శతాలతోనే 10,000 పఱుగులకు చేఱువలో ఉన్న ఆ స్ఫూర్తిమంతుడి మీద, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష , నిరంతర సాధనల పట్ల తగుస్థాయి గౌరవమూ ఉంది. (నా మిత్రులకు కొన్నిసార్లు నా వ్యాఖ్యలు అగౌరవంలానూ అనిపించాయంటే అది వాఱి తప్పు కాదు. 15 మంది ఉన్న జట్టులో ఒక్కరికే – ఆ ఒక్కరూ ఎవఱైనా సరే – పేరు రావటం సముచితం కాదనే నా అభిప్రాయం. ఆ పరిస్థితి వలన అతనొక్కడూ నిష్క్రమిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమూ పేకమేడలా కూలిపోవటం మనమే కోరి తెచుకున్న దౌర్భాగ్యమనిపిస్తుంది నాకు. ఆ పరిస్థితిని కూడా ఎదుఱీదిన స్ఫూర్తిమంతత్వం గతంలోనూ ఉన్నా శ్రీలంకతో జఱిగిన కప్ క్రీడావళి చివఱి ఘట్టంలోనూ నిదర్శనమైందన్న వాస్తవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.)

క్రికెట్ చరిత్ర పుటలలో పుంఖానుపుంఖాలుగా ప్రస్తావించదగ్గ జ్ఞాపకాలను ప్రోది చేసుకున్న “టెండూల్కర్ స్థాయి” ఒక పాఠమై నిలిస్తే క్రీడలను అనుసరించని, టెండూల్కర్‌ని పూనుకుని కీర్తించని నాలాంటి వాఱితో సహా తరతరాల భారత యువతకు స్ఫూర్తినీయగలదు. ఈ ప్రపంచ కప్ క్రీడావళిలో టీమ్ ఇండియా పన్నిన క్రీడావ్యూహాలు, ప్రదర్శించిన క్రీడాగరిమ, పోరాటపటిమ నుంచి నేర్చుకొదగ్గ విషయాలను గ్రహించకపోతే యీ విజయానికి అర్థం లేదు. ఇన్నేళ్ళ మన కల నిజం చేసారు వాళ్ళు. మఱి మన గుఱించి కలలు కనే మన బంధుమిత్రులకు, మనకు కూడా మనమే ఆ కలలను నిజం చేయాలన్న స్ఫూర్తితో సాగకపోతే 28 యేళ్ళ చరిత్ర పునరావృతికి ఉనికి ఉండదు. క్రీడాస్ఫూర్తిని దైనందిన జీవితంలోనూ అంతస్థం (internalize) చేసుకుని స్వప్నసాకారం సాధించి నేటి మన ఆనందాన్ని మనల్ని నమ్మినవాళ్ళకు కూడా అందిద్దాం.

కొసమెఱుపు: (ఇది క్రికెట్ గుఱించి కాదు. మన దేశస్థుల్లో కొందఱి మౌఢ్యాన్ని గుఱించి, జాత్యహంకారాన్ని గుఱించి.) పాకిస్థాన్ దేశమన్నా, వాఱి క్రికెట్ జట్టు అన్నా సరిపడని ముస్లిమ్ స్నేహితుడు ఒకడున్నాడు నాకు. ముస్లిమ్‌లంతా పాకిస్థాన్ జట్టుకే అభిమానులని తలచే చాలా మంది మూఢత్వానికి సమాధానం అతని ఫేస్‌బుక్ ప్రవర (profile) చూస్తే యెంత మంది అతని లాగానే, మన లాగానే మన దేశాన్ని మన జట్టుని (నా లాగా యిఱుదేశస్థుల సౌభ్రాతృత్వాన్ని ఆశించే వాఱి కన్నా) అమితంగా ప్రేమిస్తారో తెలుస్తుంది.

దొంగల ముఠా … ఎందుకు తీసినట్టు?

గమనిక: ఇది సమీక్ష కాదు! “మఱెందుకు వ్రాసినట్టు?” అనే ప్రశ్నకి సమాధానం టపాలోనే ఉంది.

(నిష్పూచీ: ఈ టపా వ్రాస్తున్నపటికి నేనింకా రామ్‌గోపాల్‌వర్మ తీసిన “దొంగల ముఠా” చూడలేదు. చూసినా నా క్రింది అభిప్రాయంలో మార్పుండబోదు. చూడకపోయినా అలాంటి అభిప్రాయమేర్పఱచుకోవటం తప్పు కాదు.)

కేవలం 6.5 లక్షల రూపాయలతో సినిమా తీసి చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. సంతోషం! (గురుదక్షిణగా వర్మ పేరునే దర్శకుడిగా ప్రకటిస్తూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన (జె.డి.) చక్రవర్తి గతంలో తీసిన మధ్యాహ్నం హత్య చిత్రానికి అయిన ఖర్చు 18 లక్షలని అప్పట్లో విన్నాను. నిజానిజాలు తెలియవు.) “అది మంచి ప్రయోగం!” అని అనను. ఎందుకంటే తెఱ మీద ఆ శ్రమ తాలూకు ఫలితం కనీస ప్రమాణాలతోనే ఉండబోతోందని వర్మకి ముందే తెలుసు. ఇక 6.5 లక్షల రూపాయలతో తీయటం అందఱికీ సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వర్మ అంతటి దర్శకుడు పిలిస్తే రవితేజ, ఛార్మి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసన్న, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సుప్రీత్ మొదలైనవాళ్ళంతా పారితోషికం లేకుండా పని చేస్తారు కానీ మీరూ నేను పిలిస్తే చెయ్యరు, క్రొత్తవాళ్ళని పెడితే చూడరు. “ఇలాంటి వినూత్న ప్రయోగాలనైతే ఆదరిస్తా”మంటూ “బయటి నుంచి మద్దతు ప్రకటించే వాళ్ళు” చాలా మందికి డి.టి.యస్. (నిశ్శబ్దం), అతడు+ఆమె=9, వంశం లాంటి సినిమాలు విడుదలైనట్టు కానీ, అలాంటివెన్నో చిత్రాలు తయారీలో ఆగిపోయిన సంగతి కానీ తెలిసి ఉండకపోవచ్చు. (“ప్రచారం చెయ్యకుంటే మా తప్పా?” అంటారా? నేను తెలుసుకున్నది కూడా వార్తాపత్రికల నుంచే మఱి! పైగా డి.టి.యస్. చిత్రంలో నటించిన ఆదిత్య ఓం, వంశంలో నటించిన చంద్రమోహన్, బాలాదిత్య, నాగబాబు క్రొత్తవాళ్ళు కాదు.) ఆ చిత్రాలెలా ఉన్నాయన్న సంగతి వదిలేస్తే వాటిలో ఉన్న ప్రయోగాత్మకతకి గుర్తింపు దక్కలేదనేది మాత్రమే నా ఉద్దేశం.

ఛాయగ్రహ నిర్వాహకులు/దర్శకులు లేకుండా, 5 మంది కెమెరామెన్‌తో, 5 ప్రధాన పాత్రలతో, 5 రోజులు చిత్రీకరణ జఱుపుకొని, 5 వారాల నిర్మాణోత్తర కార్యక్రమాల తఱువాత విడుదలైన చిత్రం దొంగల ముఠా. ప్రయోగం పేరుతో వర్మ పరమ చెత్త సినిమా తీసాడని చాలా మంది ఉద్దేశం. “సినిమాలు తీసేది యేదో నిరూపించటానికా, లేక వినోదం కోసమా?” అనడిగారు కొందఱు సమీక్షకులు. “కథాకథనాలలో క్రొత్తదనం లేకుండా సినిమాలు తీసి రచ్చకెక్కి ప్రచారంతో బ్రతికేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ”ని చెఱిగేసిన అలాంటి ప్రేక్షకసమీక్షకులకు నా ప్రశ్న: “జేమ్స్  క్యామెరూన్ తీసిన అవతార్ చిత్రంలో మీకు కనిపించిన క్రొత్తదనమేమిటి?” …నాకు తెలుసు, వెంటనే “అవతార్ లాంటి మహాద్భుతానికీ, దొంగల ముఠా లాంటి చెత్తకీ  పోలికనా?!” అంటారని. ఏం, తప్పేంటి?! ఒకడు ప్రయోగం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడుట. ’50ల, ’60ల దశకాలలోనే ప్రతి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రమూ సృష్టించలేదా క్రొత్త ప్రపంచాలను? ఫలానా లాంటి సినిమా తీయాలని నిర్ణయించుకుని, 12 యేళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించి కథాపరంగా, పాత్రల చిత్రణాపరంగా క్రొత్తదనమనేది ఈషణ్మాత్రమైనా లేని అవతార్ చూడాటానికి లేని యిబ్బంది కేవలం ఛాయాచిత్రాలు తీసుకోవటానికి వాడే 5 కెమెరాలతో 5 రోజుల్లోనైనా ఒక చలనచిత్రాన్ని తీయవచ్చని చూపిస్తేనే వచ్చిందా? అవతార్ చిత్రాన్ని ఈ శతాబ్దపు అద్భుతంగా, “తెల్లోడి మాయ”గా తేల్చేసిన చాలా మంది “మేథావి ప్రేక్షకసమీక్షకులు” నా లాంటి మూర్ఖుడికి సమాధానాలు చెప్పరు. కనీసం వాళ్ళకైనా ఆ సమాధానాలు తెలిస్తే చాలని నాకనిపిస్తుంది.

రామ్‌గోపాల్‌వర్మ యెన్ని మాటలు చెప్పి యెంత నాసిరకమైన సినిమాని యెంత విసుగు కలిగించేలా తీసారన్నదే చాలా మందికి కనిపించవచ్చు గాక తెఱ మీద. నాకు మాత్రం చిట్టి (తక్కువ నిడివి) చలనచిత్రాలు తీసే చాలా మంది ఔత్సాహికులకు ఒక నమ్మకాన్నిచ్చారనిపిస్తుంది. పారితోషికం తగ్గించుకుని చలనచిత్ర నిర్మాతలకు మేలు చేయమని యెన్ని రకాలుగా అడిగినా తల ఒగ్గని నటులు నిర్ద్వంద్వంగా ముందుకు రావాలంటే చలనచిత్ర నిర్మాణకారులు చూపించవలసిన నమ్మకం తాలూకు నిలువెత్తు రూపం కనిపిస్తుంది. లాభాల్లో వాటాలే తప్పించి పారితోషికమివ్వకపోవటమన్న పద్ధతి చలనచిత్రరంగానికి మున్ముందు యే రకమైన క్రొత్త ఊపిరులూదగలదో కనిపిస్తుంది. “ఒక సినిమా చేస్తుండగా మఱో సినిమా గుఱించి ఆలోచిస్తే మహాపాపం, కళాసరస్వతికి అవమానం! అది యేకాగ్రతని దెబ్బ తీస్తుంది.” అని “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టు కబుర్లు చెప్పే చాలా మంది దర్శకులకు చెంపపెట్టులా కనిపిస్తుంది. కోడిరామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఉద్దండులు ఏకసమయంలో అనేక చిత్రీకరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఆశాభావం చిగురిస్తుంది.

కొసమెఱుపు: మన ఖర్మ యేమిటంటే సినిమాని ఆరున్నర లక్షల్లో తీసినా అరవై కోట్లతో తీసినా ప్రేక్షకుల నెత్తిన పడే టికెట్ ధరలో మార్పు లేకపోవటం. అది మాఱకపోతే నాలాంటి వాడికి యెన్ని ఆశలు చిగురించినా ప్రేక్షకుడికి జేబు చిఱుగుతూనే ఉంటుంది. ఎప్పటి లాగే అ.సం.రాలో ఈ చలనచిత్రానికి టికెట్ ధర $12. మఱి యీ దొంగల ముఠా వలన వచ్చే బాధలు తీర్చేదెవఱు?!

(షరా: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు చిత్రం కూడా నేనింకా చూడలేదు. ఒకవేళ అదీ బాగాలేదనిపించినా దానికీ, దీనికీ దీని తఱువాత రామ్‌గోపాల్‌వర్మ తీయబోయే చిత్రాలకి, అంతకు ముందు వర్మ తీసిన చిత్రాలకీ ముడి పెట్టబోను. దేని సంగతి దానిదే! మఱొక సంగతి కూడా చెప్పాలి: “వర్మ యింత కన్నా బాగా తీయగలడు” అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ, “పెట్టనమ్మ యెలాగూ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టే ముం*వి నీకేమయిం”దన్న బిచ్చగాడి సామెత చెప్పినట్టు కళాభిక్ష కోసం చూస్తున్న నాలాంటి వాడికి దర్శకుడు సరిగా తీయలేదని అతన్ని తిట్టే హక్కు మాత్రం ఉండదు. “నచ్చకపోతే చూడకండి. ఎలాగైనా చూడమని యెవడేడిసాడు?” అని వర్మయే అన్నారు ఎన్నోసార్లు.)

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:

ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:

  • ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
  • మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
  • చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
  • తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
  • తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
  • సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
  • తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.

పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)

షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.

ఇందుకా తెలంగాణా?! థూ… జీవితం!

మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారాగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.

“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:

నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుకుతూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!

సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!

సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు!

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతి భ్రమ్శాత్ బుద్ధినాశా బుద్ధినాశా పణశ్యతి

(భగవద్గీత – ఇది తెలంగాణా కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర కాదు… హర్యానాలో జఱిగింది.)

పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” అని చెప్పింది మనుస్మృతి. అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది. ఇలా అనగానే మన స్త్రీవాదులకు “మనువు” మీద మనసు మండుతుంది. మనుస్మృతి పాటించాలని అనటంలేదు. (పాటించాలంటే మఱి తద్దినపు భోజనంలో బ్రాహ్మణుడికి ఖడ్గమృగం మాంసం వడ్డించాలిట!) భారతీయ సమాజంలో అంతర్లీనంగా అంతటా ఉండే ఛాందసం అమ్మాయిలకు నయానో భయానో ఆజన్మాంతమూ సర్దుకుపోవటమే నేర్పుతుంది. ఇంట్లో వాళ్ళకెంత స్వేచ్ఛనిచ్చినా సమాజం మొత్తంలోనూ అంతటి భావవైశాల్యం లేదు కనుక యెన్నెన్నో రకాలుగా మన స్త్రీలు సర్దుకుపోవటాన్ని ఒక జీవనశైలిగా స్వీకరించటం జఱుగుతుంది. దానితో వాళ్ళు స్వచ్ఛందంగానూ ఆనందంగానూ తమ స్వాతంత్ర్యాన్ని భర్త, కుటుంబం, సమాజం వంటి బాహ్యాధిపతులకు విడిచిపెడతారు. ఇదే అన్ని సమస్యలకూ మూలమనిపిస్తుంది. మౌనమే భూషణంగా ఆధారపడటము, సర్దుకుపోవటము ఆడవాళ్ళకి అలవాటైపోయిన పరిస్థితిలోనే దోషముంది!

తనకంటూ ఒక రూపము, ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని – ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా – ఎందుకు తట్టుకోలేడు? తనలోని ప్రతి అంగము, ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు? ఏమిటి మగతనం గొప్ప? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా?! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు, ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన “ఘనత” అది. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మఱో బంధువు కావచ్చు – వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా? స్త్రీలకు రిజర్వేషన్లు “ఇవ్వటం”, స్వేచ్ఛని “ఇవ్వటం” – ఈ యివ్వటమేంటి అసలు?! ఒకరికి స్వేచ్ఛనిచ్చే “హక్కు”, “అధికారం” ఎవఱికున్నాయి?! వాళ్ళకి “ఉండవలసిన” స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా?! (ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు, శక్తిస్వరూపిణులు లేరా? హుఁ, ఉంటే మాత్రమేం లాభం? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా!) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా, మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది. ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు. అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు, కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు!

“ఉద్యోగమ్ పురుషలక్షణమ్” అన్న మాట పట్టుకుని స్త్రీలు ఉద్యోగాలు చేయరాదనేవాళ్ళు కొందఱు. సంస్కృతంలో “ఉద్యోగమ్” అంటే “ప్రయత్న”మనీ “పురుష” అన్న మాట మనుషులందఱికీ వర్తిస్తుందనీ గ్రహిస్తే “ప్రయత్నం చెయ్యటం మానవ లక్షణం” అని చెప్పారని అర్థమవుతుంది! “ఇంటికి దీపం ఇల్లాలు” అన్నది కూడా ఒక స్త్రీ వెలుగులీనే స్థాయిలో పురుషుడు వెలగలేడని అన్వయం కావచ్చు. అలాంటి దీపాలన్నీ నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న స్వార్థం భావ్యమా? స్త్రీలు యింట్లోనూ, ఉద్యోగంలోనూ రెండింటా పని వత్తిడిని తట్టుకోలేరని కొందఱి “బాధ”. ఇంట్లోనే అన్ని రకాల పనులు చెయ్యగలిగే స్త్రీ బైట మఱో పని చెయ్యలేదా?! ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు తగు సహాయమందిస్తే వత్తిడి తగ్గుతుంది కూడా! కాదా? అసలు స్త్రీ యింట్లో చేసే పనులకు విలువ కట్టగల షరాబులెవ్వఱు? ఉన్నారు… ఎవఱి జీవితాన్ని వాళ్ళే బ్రదికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తల్లులు సగటున చేస్తున్న ఇంటి పనులకు జీతంతో తూకం వేసింది ఒక సంస్థ. కొన్నేళ్ళ క్రితం చేసిన యీ పరిశోధనలో తేలిన విషయమేంటంటే జీతాలివ్వటమంటూ జఱిగితే ఒక్కో స్త్రీ చేస్తున్న పనులకి (రూపాయలలోకి మార్చితే) సంవత్సరానికి 54 లక్షల రూపాయలు ఇవ్వాలట!! అ.సం.రా దేశంలోనే అలా ఉంటే తల్లిగా/భార్యగా అన్నీ తానే అయి పని చేసే మన దేశంలో?! కనీసం ఊహించగలమా? పైగా “తల్లి ప్రేమని మించింది లే”దంటారు. స్త్రీలందఱికీ వేఱుగా “పిల్లలని ప్రేమించటమెలా?” అని పాఠాలు బోధిస్తున్నారా, లేదే? సహజసిద్ధంగా స్త్రీలలో ఉండే నిస్స్వార్థమైన ప్రేమ తల్లి ప్రేమ రూపంలో కనిపిస్తోందే కానీ వాళ్ళకి అలా ప్రేమించటానికి సమకూర్చబడిన జ్ఞానమూ, రెండో మనసూ లేవు! అది స్త్రీకి స్వతస్సిద్ధమైన లక్షణం కానప్పుడు స్త్రీలే అలా ప్రేమించగలరనుకోవటం కూడా తప్పే! తండ్రి అంతగా ప్రేమిస్తే కాదన్నదెవఱు?! మగవాడు కూడా అలా ప్రేమించలేకపోతే తండ్రి తప్పే కానీ తల్లి గొప్ప కాదు! (ప్రేమిస్తున్నామంటూ స్త్రీల వెనుక విసుగు లేకుండా తిఱిగే పురుషులు ఆ మాత్రం ప్రేమించగలరు లెండి!)

చలనచిత్రాల్లో, సాహిత్యంలో, ఇతర కళల్లో, సమాజంలో, జీవితంలో, విద్యలో, ఉద్యోగాల్లో, పెళ్ళిలో, కుటుంబంలో, ఇంట్లో… దాదాపుగా ప్రతీ చోటా మగవాళ్ళు ఆడవాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు తన జీవితంలోకి తొలి అడుగైనా వేయక ముందే తన జీవితాన్ని నిర్దేశించదలచిన మగవాడి కోసం యే ఆడదైనా యెందుకు సర్దుకుపోవాలి? తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే మఱొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక! స్త్రైణ్యం ముందు పౌరుషమెంత చిన్నబోతుందో గ్రహించి ప్రతి పురుషుడూ ఆ స్త్రైణ్యాన్ని కేవలం ఒప్పుకోవటం కాక దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అచ్చెఱువొందాలని, ఆరాధించాలని నా ప్రార్థన! మన గుఱించి మనం మఱచిపోయినా మనల్ని కనిపెట్టుకుని ఉన్న ఆ మఱొకరికి ప్రణమిల్లటం తప్పనిసరి!

స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అనీ, పురుషుడు పురుగు లాంటివాడనీ కాదు నా భావన. బేలగా కనిపించినంత మాత్రాన మన వయసు స్త్రీ మన కన్నా లోతుగా ఆలోచించగలిగి, జీవితాన్ని మన కన్నా ధైర్యంగా ఎదుర్కొనగలిగి ఆ పైన ఆ బేలతనాన్ని కూడా ఆస్వాదించగలదని మఱచిపోరాదు. మగవాడు మ్రాన్పడిపోయిన యెన్నో సందర్భాలలో – పురాణాలలో కైకేయి, సత్యభామలతో సహా – స్త్రీ సారథ్యంలోనే సమస్యలు పరిష్కరింపబడటం కద్దు. ఒక దర్శకురాలిగా (director), కార్యనిర్వహణాధికారిగా (manager), సంయామికగా (administrator), ఒక ఆర్థికవేత్తగా (economist), ఒక గురువుగా (teacher), …మగవాడి ఊహకు కూడా అందని యెన్నో రకాలుగా తన జీవితంలో విభిన్నమైన భూమికలు పోషించే స్త్రీకి నా జీవితమే జోహారుగా అర్పిస్తాను!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర – దానినిప్పుడు తెనిగించాను.)

షరా: 1. గతంలో మాతృదినోత్సవం నాడు వ్రాసిన టపాలో యిలాంటి దినాల మీద నా అభిప్రాయాన్ని పంచుకున్నాను కనుక మఱలా చెబితే చర్వితచర్వణమవుతుంది.
2. “పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు…” అన్న పంక్తి 1988వ సంవత్సరంలో విడుదలైన “ఆడదే ఆధారం” అన్న చలనచిత్రం కోసం శ్రీ సీతారామశాస్త్రి వ్రాసిన “మహిళలు మహరాణులు…” అన్న నిందాత్మక(స్తుతి)గీతంలోనిది.

క్రొత్త “యేటి” అభిషేకం: ఆత్మావలోకనానికి అవకాశం

(ఈ టపాకి స్వీయ ఆంగ్లానువాదాన్ని యిక్కడ చదవగలరు.)

పొరపాటున చెయి జాఱిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?

పొరపడినా, పడినా జాలి పడదే కాలం మన లాగా!
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చే దాకా!

(ఇవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి కూర్చిన మాటలే అయినా మన మనసుల భాష యిది – అది ఏకవచనమే! ఎందుకంటే యీ హెచ్చరికలు చేస్తున్నది మన అందఱి సొంత గొంతుక!)

… “నీ ప్రశ్నలు నీవి” యని మనకు గుర్తు చేసిన కాలం “ప్రశ్నలోనే బదులు ఉంది” అనీ అంత కన్నా ముందే చెప్పింది. విన్నామా, గ్రహించామా, నేర్చుకున్నామా, పాటించామా అన్నది ముఖ్యం. 2010 వెళ్ళిపోకా తప్పదు. 2011 రాకా తప్పదు. ఆ మధ్యన మనమెంత బాగుపడ్డాము, ఎంత మందిని/దేన్ని ఎలా బాగు చేసాము, ఎన్ని/ఏం పాఠాలు నేర్చుకున్నాము? అన్నవే ముఖ్యం. క్రొత్త సంవత్సరం మఱిన్ని పాఠాలు తెచ్చే లోపు పాత పాఠ్యక్రమం (syllabus) మొత్తమూ పునఃపునః ఔపోసన పట్టడం మన వంతు. అది చేయకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మాఱినా కాలం-డర్ (కాలమంటే భయం) మాఱదు. క్రొత్త యేటిని మనం ఆహ్వానించటం కాదు చెయ్యవలసినది – అది మన పూనిక లేకపోయినా యెలాగూ వస్తుంది. క్రొత్త యేడనే మందిరంలో మనం అడుగు పెట్టబోయే ముందు మనకై మనమే పూనుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి. మన ప్రతి ఆచారం వెనుక ఒక భయం కానీ భక్తి కానీ ఉంటాయంటారు. ఈ నూతనసంవత్సరాహ్వానం భయంతో చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, భయమూ భక్తీ మఱచిన మౌఢ్యంతో చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి… కాలం మనల్ని దాటిపోకముందే.

మాతృదేవోభవ!

“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:

http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)

కనబడుట లేదు!

పేరు: చాంచల్యం కరిగిన బాల్యం!
గుర్తులు:
తప్పిపోయిన సమయంలో స్వచ్ఛమైన మనసు తొడుక్కుని ఉంది,
మనిషితనం తప్పించి మరే భాషా రాదు,
మనసు భాష కొంచెం అర్థం చేసుకోగలదు
“పైకి తెలియకపోయినా
అందరూ నిన్నే వెతుకుతున్నారు…
నీవు వెళ్ళినప్పటి నుంచి
బ్రతుకుతల్లి నవ్వుని మరచిపోయింది!
వచ్చెయ్యి, నిన్ను నన్నుగా చేసుకుంటా!”

నేడు తెలుగు భాషా దినోత్సవం

(తొలుత “ఆర్కుట్”లోని ఒక కూటమిలో వ్రాసిన యీ టపాని తగుమాత్రంగా దిద్ది యిక్కడ ఉంచుతున్నాను.)

మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం!

ప్రతి భాషకు “మనుగడ ప్రశ్నార్థకమే” అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న మన భాష బావుటా వెలవెలబోయే పరిస్థితి కనీసం మన తరం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులోని “రుచి” మారదు, కాలుష్యం పెరగదు, అడుగంటిపోదు! (మధురమైన భాషను ఉప్పు నీటి సముద్రంతో పోల్చటం అనౌచిత్యమే కావచ్చు కానీ “రుచి” అన్నది “స్వధర్మం” అన్న అర్థంలో తీసుకోమని మనవి. మరో సంగతి: రుచి అన్న పదానికి “ఉప్పు” అన్న అర్థం కూడా ఆపాదించబడింది

శాస్త్ర/సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific/technical jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికి కావలసింది ఆ భాషకు “దినం” పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషించటంతో భాషకు కొత్త ఊపిరులు పోసుకోదు నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మాత్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! (నేను తెలుగులోనే సంబోధిస్తానని మనవి.) ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంతరీకరణలు (transformations), యుద్ధాలు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాషకు మన రోజువారీ సంభాషణలే ప్రాణవాయువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి ఉంది… అది ఎంత మంది చేస్తున్నాము?! “అదేంటి?” అంటారా? తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని/అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం – “ఇవి చేస్తున్నామా?” అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న! “ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు” అన్న సామెత మనదే! దురదృష్టవశాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! …నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్ఠం చేయటం ఎంత అవసరమో కాలానుగతంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ “ఎప్పుడో బళ్ళో చదువుకుని వదిలేసిన సంగతులు”! సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు అనవసర కష్టాలు

మనకు “పుస్తకాలు చదవటం bore”, ప్రాచీన కళలైన “సాంప్రదాయక సంగీతనృత్యాలు slow” వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. (వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ, చర్చించటమూ మానేసామని!) అదేంటో… ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది “మన సంగీతం slow” అన్న మాట వింటే! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని, స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు “విమర్శకు”లకు తెలియదు కాబోలు! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు… కానీ, ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం!

మన వాళ్ళకు ఉండే మరో జాడ్యం “గొప్పలు చెప్పుకోవటం”! బొట్టు పెట్టుకోవటం మన సంప్రదాయం, అందరికీ నమస్కరించటం మన సంప్రదాయం, తెలుగు భాష తీయనైనది… ఇలా ఎన్నైనా చెబుతాం. ఎందుకు “గొప్ప” అంటే ఇదమిత్థంగా చెప్పలేక తడబడతాం! “గొప్ప” అని తెలిసి అందరికీ చెప్పుకోవాలనిపించటం తప్పు కాదు కానీ ఎందుకు గొప్ప అన్నది తెలుసుకునే జిజ్ఞాస లేని జాతి మనది అన్నది నిష్ఠురసత్యం! “దేశభాషలందు తెలుగు లెస్స” అని చెప్పుకుని గర్వపడతామే కానీ అక్కడ “దేశం” అంటే వేల భాషలకు ఆలవాలమైన భారతదేశం కాదని, అప్పట్లో ఉన్నది చిన్నా చితకా రాజ్యాలేనని గ్రహించము! మాతృభాష అన్నది ఒక గొప్పతనంగా భావిస్తామే కానీ ఆ కాలంలో ఆయా రాజ్యాల ప్రజలందరూ పొరుగు రాజ్యాల భాషలు నేర్చుకునేవారని గ్రహించము! మన భాష అతి ప్రాచీనమైనదని చెప్పుకుని అందుకు ఉన్నవీ, లేనివీ ఆధారాలు కల్పించుకుంటాం! తమదే ప్రాచీనభాష అన్నందుకు తమిళులని తప్పు పడతాం! అంతే కానీ, నిజంగానే తమిళభాష తెలుగు కన్నా ముందే పుట్టిందేమోనని, కనీసం దాని లిపి దాదాపు 1500 యేళ్ళుగా మారలేదని మనం గ్రహించుకోము!

…తెలుగు భాషను కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు! విశ్లేషణాత్మక/విమర్శనాత్మక/తార్కిక దృక్పథాలు కరువై, ఇలాంటి పదాలే బరువైన మన తరానికి తెలుగు భాషని అంతమొదించేంతటి సత్తువ లేదు! తెలుగు భాషను ప్రాణప్రదంగా పూజించేవాళ్ళకు కొదువా లేదు! మనకు పార్శ్వపు అంధత్వం (selective blindness), పార్శ్వపు మతిమరపు (selective amnesia) ఉండటమూ, మన భాషాసంస్కృతుల పట్ల మనకు అవగాహన, అభిమానము లేకపోవటము వంటి ఎన్నో కారణాలు మనమే అనునిత్యం పరీక్షించుకుని మనలని మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది… అది కూడా మన అవసరమేనని గ్రహిస్తే చాలు – అదే తెలుగు భాషకు పదివేలు, భావి తరాలకు మనం చేసే మేలు! (పార్శ్వం అంటే selective కాదు… “ఒక వైపు” అని మాత్రమే. కనుక దీనిని సందర్భోచితమైన అనుసరణగానే స్వీకరించానే తప్పించి నిక్కచ్చి అనువాదం కాదు.)

కొన్ని వివరణలు:

  1. ఆముక్తమాల్యద”లోనిదిగా ప్రముఖమైన “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వ్యాఖ్య కృష్ణదేవరాయలే రచించినట్టు నమ్మితే “దేశం” అన్న పదం “విజయనగర సామ్రా”జ్యాన్ని సూచిస్తుంది. కానీ, శ్రీనాథుడిదిగా చెప్పబడుతున్న “జనని సంస్కృతంబు సకల భాషలకును / దేశభాషలందు తెలుగు లెస్స / …” అన్న ఆటవెలది పద్యం ఒకటి ఉంది. కానీ, ఏది ముందు వ్రాసినదో ఇదమిత్థంగా తెలియదు! మన కవులు తమకు తాము తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వలనేనేమో… వారి గురించిన విషయాలు వారి రచనల్లో ఎక్కువగా కనిపించవు. అందుకని వారి దేశకాలాలను మనం నిర్ధారించలేని స్థితిలో ఉన్నాము. ఈ విషయాలేవీ మనలో చాలా మందికి తెలియదు! తెలిసినా కూడా పరిశోధించే ఉద్దేశము, పరిశీలించే ఉత్సుకత లేవు చాలా మందిలో!
  2. తమిళులు చేసిన స్వార్థపుటన్యాయం వేరే ఉంది: తమిళభాష ప్రాచీనమైనదని ప్రభుత్వం తీర్మానించిన వెంటనే ప్రాచీనభాషలను గుర్తించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కాలవ్యవధిని 2000 సంవత్సరాలకు పెంచటం!
    3. మన భాషకు లిపి నేటి స్థాయికి చేరినది ఎప్పుడో తెలుసా? ముద్రణ యంత్రాలు మన దేశానికి వచ్చిన తరువాత – అంటే 19వ శతాబ్దంలో!

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)