మన “వాళ్ళు” సాధించారు… మఱి మనం?

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం!” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని పాటలో వ్రాసినట్టు అనుమానాస్పదరీతిలో మొదలైనా గెలుపును అందుకోవటానికి తగిన విజిగీష (zeal) కనిపించింది “టీమ్ ఇండియా” ఆటగాళ్ళలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో! ఆ తపనకు “సాహో” అనుకుని గెలుపు మీద నమ్మకంతో కళ్ళారా నిద్రపోయాను నిన్న రాత్రి. (నిద్ర మధ్యలో 274/6 అన్న స్కోర్ చూసాక మఱీ సుఖంగా పట్టింది నిద్ర.) విజయమెపుడూ అనాయాస విలాసం కాదనీ, అకుంఠిత దీక్ష ఫలితమేనని గుర్తు చేసే ఉత్కంఠను రేపిన పోటీ యని నిద్ర లేచాకనే తెలిసింది.

…నిజానికి నేను క్రికెట్‌నే కాదు, ఏ క్రీడావళినీ (tournament) పెద్దగా అనుసరించను. అక్కడెక్కడో యెవఱో ఆడుతుంటే యిక్కడ నేను నా పని మానుకుని చూసేదేమిటన్న అలక్ష్యమది. “బోడి చదువులు వేస్టు, నీ బుఱ్ఱంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని గురువుగారు వ్రాసినా “క్రీడల్లోనైనా స్ఫూర్తిమంతులుగా, విజయార్హులుగా ఉండా”లనే చెప్పిన సూత్రమేనని గ్రహించాను తప్పితే గురువాక్యంగా స్వీకరించి నాది తప్పనుకోలేదు. (ఆ స్ఫూర్తితోనే నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గీతరచనలోనూ, తెలుగుసినిమా.కామ్ జాలగూటి కోసం వ్యాసాలు, సమీక్షలు, తదితరరచనావ్యాపకంగా మళ్ళించానని యీ సందర్భంగా ప్రస్తావించటం సముచితం.) 1983 ప్రపంచ కప్ క్రికెట్ క్రీడావళి సమయానికి నాకు ఊహ తెలిసినా అప్పట్లో ప్రసారమాధ్యమాలు యింత విరివిగా లేవు. అప్పటికి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టలేదు. (అప్పటికి నాకు ఐదేళ్ళు.) ఆ తఱువాతి ప్రపంచ కప్ క్రీడావళులు (1987, రిలయన్స్ కప్; 1992, బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్) మాత్రం చాలా వఱకు అనుసరించాను, ముఖ్యంగా 1987 నాటికి క్రికెట్ ఆడేవాడిని కనుక. (1992 నాటికి దాదాపుగా ఆపేసానని చెప్పాలి.) ఈ కారణాల వలన కూడా క్రికెట్ లేద్దా మఱో క్రీడ – ముఖ్యంగా “ప్రేక్షక క్రీడలు” (“spectator sports” అని మా అన్న సూచించిన పదబంధం) – మనిషిలో నింపే స్థైర్యం, ఎదుగుదల లాంటివి నాకు పరిచయం లేదని ఒప్పుకోవాలి. (1985-’86 ప్రాంతాల్లో యండమూరి వ్రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో నాయకుడు రేవంత్ ప్రపంచవిజేతను చదరంగం ఆటలో ఓడించి స్వదేశానికి వచ్చిన సందర్భంలో తన ఆప్తమిత్రుడు జేమ్స్‌తో ఒక సంభాషణ కనిపిస్తుంది: “…నీకు తెలుసా, జేమ్స్? కనీసం ప్రాంతీయ క్రీడామండలి సెక్రెటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు.” “కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా?” – “కాదు, తెలుగువాడిని కావటం” అన్న జవాబిప్పుడు అప్రస్తుతం – ఆ సంభాషణలోని వాస్తవం కూడా ఒక కారణం నాకు క్రికెట్ అంటే చిన్న చూపు యేర్పడటానికి. అతిప్రాచుర్యం (Hype) కల్పించినదాని పట్ల విముఖత నాలో చిన్నపుడే మొదలయిందనటానికి యిదొక నిదర్శనం.)

ఈ ఉపోద్ఘాతమంతా యెందుకంటే యీసారి ప్రపంచ కప్ టీమ్ ఇండియాదేనని మొదటి నుంచీ నాకెందుకో నమ్మకంగా ఉండింది. (క్రికెట్‌ని తదేకంగా అనుసరించకపోవటం వలన కూడా నాకీ నమ్మకం కలిగి ఉండవచ్చు.) మొదట్లో కొంత పడుతూ లేస్తూ సాగినా ఓటమినెఱుగని రీతిలో సాగటం నిర్ద్వంద్వంగా నా నమ్మకాన్ని పెంచింది. ప్రపంచ కప్ క్రీడావళి మొదలైనప్పుడే (నాకు క్రికెట్ పట్ల ఆసక్తి పెద్దగా లేదని అప్పటికి అతనికి తెలియక) భారత క్రీడాకారచయం (team) అభిమానుల ఆశలను ప్రతిబింబించేలా నేనొక గీతం వ్రాస్తే దృశ్యకం (video) తయారుచేద్దామనుకుంటున్నానని ఒక దర్శక-మిత్రుడు అడిగాడు. అప్పటి నుంచి కొద్దో గొప్పో ఆసక్తితో అనుసరించాను యీ క్రీడావళినీ, ఆటగాళ్ళ పాత్రపోషణను. నిజానికి పల్లవి వఱకు వ్రాసిన తఱువాత ఆ గీతదృశ్యక రూపకల్పన సాధ్యం కాదని తేలినా ఆ పల్లవి మాత్రం పదేపదే నా నమ్మకానికి రూపంగా నిలిచింది. ప్రఖ్యాత బ్రెజిల్ రచయిత పాలో కొయెలో చెప్పిన ఒక సూక్తిని తెనిగిస్తూ వ్రాసిన ఆ పల్లవి యిదీ:

కోట్ల మందిని ప్రతినిధులుగా మీరు నిలిచిన ఆటలో
కోరి వళ్డ్ కప్ తీసుకొస్తారంటు గెలిచే ఆశతో
మది నమ్మిన విజయం కోసం ప్రతి అడుగూ అంకితమైతే
మన ఱేపటి ఉదయం కోసం జగమంతా వెలుగులనీదా!

ఇన్నేళ్ళ కల నిజమవ్వాలని మీ వెంటుందిలా యీ భరతావని!

పాలో కొయెలో రచనలు నేను చదవలేదు, కానీ నా సొంత సూక్తి ఒకటి ఉంది యిలాంటిదే: “మన నిశ్చయాన్ని నిజం చేయటం కన్నా విధికి మఱో యెంపిక లేదు!” (“Fate has no choice than to realize what we determine.”). నా దృష్టిలో టీమ్ ఇండియా సాధించిన యీ విజయానికి కారణం జట్టులోని ఆటగాళ్ళందఱూ త్రికరణశుద్ధిగా అలాంటి సూక్తుల అంతరార్థాన్ని, స్వప్నమాత్రంగా ఉన్న యీ విజయాన్ని “నమ్మటం”… అదీ గత ప్రపంచ కప్ క్రీడావళి అనుభవం నేర్పిన పాఠాలను నిరంతరం స్మరించుకుని నాటి ఉన్మాదాత్మక అభిమానుల ఆగ్రహజ్వాలలో తమ స్థైర్యానికి చితి పేర్చకపోవటం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. (వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే ఉన్న “విజయమా విజయమా – వస్తూ శిఖరాన్నెక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు…” అన్న వాక్యం యీ సందర్భంగా గమనార్హం. శ్రీశ్రీ వ్రాసిన ఆఁ.. అన్న కవిత కూడా.)

టెండూల్కర్‌కి నేను అభిమానిని కాను. కారణం పైన పేర్కొన్నట్టు అతనికి అందఱూ యిచ్చే అతిప్రాచుర్యమే. కానీ, కేవలం తన శతాలతోనే 10,000 పఱుగులకు చేఱువలో ఉన్న ఆ స్ఫూర్తిమంతుడి మీద, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష , నిరంతర సాధనల పట్ల తగుస్థాయి గౌరవమూ ఉంది. (నా మిత్రులకు కొన్నిసార్లు నా వ్యాఖ్యలు అగౌరవంలానూ అనిపించాయంటే అది వాఱి తప్పు కాదు. 15 మంది ఉన్న జట్టులో ఒక్కరికే – ఆ ఒక్కరూ ఎవఱైనా సరే – పేరు రావటం సముచితం కాదనే నా అభిప్రాయం. ఆ పరిస్థితి వలన అతనొక్కడూ నిష్క్రమిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమూ పేకమేడలా కూలిపోవటం మనమే కోరి తెచుకున్న దౌర్భాగ్యమనిపిస్తుంది నాకు. ఆ పరిస్థితిని కూడా ఎదుఱీదిన స్ఫూర్తిమంతత్వం గతంలోనూ ఉన్నా శ్రీలంకతో జఱిగిన కప్ క్రీడావళి చివఱి ఘట్టంలోనూ నిదర్శనమైందన్న వాస్తవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.)

క్రికెట్ చరిత్ర పుటలలో పుంఖానుపుంఖాలుగా ప్రస్తావించదగ్గ జ్ఞాపకాలను ప్రోది చేసుకున్న “టెండూల్కర్ స్థాయి” ఒక పాఠమై నిలిస్తే క్రీడలను అనుసరించని, టెండూల్కర్‌ని పూనుకుని కీర్తించని నాలాంటి వాఱితో సహా తరతరాల భారత యువతకు స్ఫూర్తినీయగలదు. ఈ ప్రపంచ కప్ క్రీడావళిలో టీమ్ ఇండియా పన్నిన క్రీడావ్యూహాలు, ప్రదర్శించిన క్రీడాగరిమ, పోరాటపటిమ నుంచి నేర్చుకొదగ్గ విషయాలను గ్రహించకపోతే యీ విజయానికి అర్థం లేదు. ఇన్నేళ్ళ మన కల నిజం చేసారు వాళ్ళు. మఱి మన గుఱించి కలలు కనే మన బంధుమిత్రులకు, మనకు కూడా మనమే ఆ కలలను నిజం చేయాలన్న స్ఫూర్తితో సాగకపోతే 28 యేళ్ళ చరిత్ర పునరావృతికి ఉనికి ఉండదు. క్రీడాస్ఫూర్తిని దైనందిన జీవితంలోనూ అంతస్థం (internalize) చేసుకుని స్వప్నసాకారం సాధించి నేటి మన ఆనందాన్ని మనల్ని నమ్మినవాళ్ళకు కూడా అందిద్దాం.

కొసమెఱుపు: (ఇది క్రికెట్ గుఱించి కాదు. మన దేశస్థుల్లో కొందఱి మౌఢ్యాన్ని గుఱించి, జాత్యహంకారాన్ని గుఱించి.) పాకిస్థాన్ దేశమన్నా, వాఱి క్రికెట్ జట్టు అన్నా సరిపడని ముస్లిమ్ స్నేహితుడు ఒకడున్నాడు నాకు. ముస్లిమ్‌లంతా పాకిస్థాన్ జట్టుకే అభిమానులని తలచే చాలా మంది మూఢత్వానికి సమాధానం అతని ఫేస్‌బుక్ ప్రవర (profile) చూస్తే యెంత మంది అతని లాగానే, మన లాగానే మన దేశాన్ని మన జట్టుని (నా లాగా యిఱుదేశస్థుల సౌభ్రాతృత్వాన్ని ఆశించే వాఱి కన్నా) అమితంగా ప్రేమిస్తారో తెలుస్తుంది.

దొంగల ముఠా … ఎందుకు తీసినట్టు?

గమనిక: ఇది సమీక్ష కాదు! “మఱెందుకు వ్రాసినట్టు?” అనే ప్రశ్నకి సమాధానం టపాలోనే ఉంది.

(నిష్పూచీ: ఈ టపా వ్రాస్తున్నపటికి నేనింకా రామ్‌గోపాల్‌వర్మ తీసిన “దొంగల ముఠా” చూడలేదు. చూసినా నా క్రింది అభిప్రాయంలో మార్పుండబోదు. చూడకపోయినా అలాంటి అభిప్రాయమేర్పఱచుకోవటం తప్పు కాదు.)

కేవలం 6.5 లక్షల రూపాయలతో సినిమా తీసి చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. సంతోషం! (గురుదక్షిణగా వర్మ పేరునే దర్శకుడిగా ప్రకటిస్తూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన (జె.డి.) చక్రవర్తి గతంలో తీసిన మధ్యాహ్నం హత్య చిత్రానికి అయిన ఖర్చు 18 లక్షలని అప్పట్లో విన్నాను. నిజానిజాలు తెలియవు.) “అది మంచి ప్రయోగం!” అని అనను. ఎందుకంటే తెఱ మీద ఆ శ్రమ తాలూకు ఫలితం కనీస ప్రమాణాలతోనే ఉండబోతోందని వర్మకి ముందే తెలుసు. ఇక 6.5 లక్షల రూపాయలతో తీయటం అందఱికీ సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వర్మ అంతటి దర్శకుడు పిలిస్తే రవితేజ, ఛార్మి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసన్న, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సుప్రీత్ మొదలైనవాళ్ళంతా పారితోషికం లేకుండా పని చేస్తారు కానీ మీరూ నేను పిలిస్తే చెయ్యరు, క్రొత్తవాళ్ళని పెడితే చూడరు. “ఇలాంటి వినూత్న ప్రయోగాలనైతే ఆదరిస్తా”మంటూ “బయటి నుంచి మద్దతు ప్రకటించే వాళ్ళు” చాలా మందికి డి.టి.యస్. (నిశ్శబ్దం), అతడు+ఆమె=9, వంశం లాంటి సినిమాలు విడుదలైనట్టు కానీ, అలాంటివెన్నో చిత్రాలు తయారీలో ఆగిపోయిన సంగతి కానీ తెలిసి ఉండకపోవచ్చు. (“ప్రచారం చెయ్యకుంటే మా తప్పా?” అంటారా? నేను తెలుసుకున్నది కూడా వార్తాపత్రికల నుంచే మఱి! పైగా డి.టి.యస్. చిత్రంలో నటించిన ఆదిత్య ఓం, వంశంలో నటించిన చంద్రమోహన్, బాలాదిత్య, నాగబాబు క్రొత్తవాళ్ళు కాదు.) ఆ చిత్రాలెలా ఉన్నాయన్న సంగతి వదిలేస్తే వాటిలో ఉన్న ప్రయోగాత్మకతకి గుర్తింపు దక్కలేదనేది మాత్రమే నా ఉద్దేశం.

ఛాయగ్రహ నిర్వాహకులు/దర్శకులు లేకుండా, 5 మంది కెమెరామెన్‌తో, 5 ప్రధాన పాత్రలతో, 5 రోజులు చిత్రీకరణ జఱుపుకొని, 5 వారాల నిర్మాణోత్తర కార్యక్రమాల తఱువాత విడుదలైన చిత్రం దొంగల ముఠా. ప్రయోగం పేరుతో వర్మ పరమ చెత్త సినిమా తీసాడని చాలా మంది ఉద్దేశం. “సినిమాలు తీసేది యేదో నిరూపించటానికా, లేక వినోదం కోసమా?” అనడిగారు కొందఱు సమీక్షకులు. “కథాకథనాలలో క్రొత్తదనం లేకుండా సినిమాలు తీసి రచ్చకెక్కి ప్రచారంతో బ్రతికేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ”ని చెఱిగేసిన అలాంటి ప్రేక్షకసమీక్షకులకు నా ప్రశ్న: “జేమ్స్  క్యామెరూన్ తీసిన అవతార్ చిత్రంలో మీకు కనిపించిన క్రొత్తదనమేమిటి?” …నాకు తెలుసు, వెంటనే “అవతార్ లాంటి మహాద్భుతానికీ, దొంగల ముఠా లాంటి చెత్తకీ  పోలికనా?!” అంటారని. ఏం, తప్పేంటి?! ఒకడు ప్రయోగం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడుట. ’50ల, ’60ల దశకాలలోనే ప్రతి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రమూ సృష్టించలేదా క్రొత్త ప్రపంచాలను? ఫలానా లాంటి సినిమా తీయాలని నిర్ణయించుకుని, 12 యేళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించి కథాపరంగా, పాత్రల చిత్రణాపరంగా క్రొత్తదనమనేది ఈషణ్మాత్రమైనా లేని అవతార్ చూడాటానికి లేని యిబ్బంది కేవలం ఛాయాచిత్రాలు తీసుకోవటానికి వాడే 5 కెమెరాలతో 5 రోజుల్లోనైనా ఒక చలనచిత్రాన్ని తీయవచ్చని చూపిస్తేనే వచ్చిందా? అవతార్ చిత్రాన్ని ఈ శతాబ్దపు అద్భుతంగా, “తెల్లోడి మాయ”గా తేల్చేసిన చాలా మంది “మేథావి ప్రేక్షకసమీక్షకులు” నా లాంటి మూర్ఖుడికి సమాధానాలు చెప్పరు. కనీసం వాళ్ళకైనా ఆ సమాధానాలు తెలిస్తే చాలని నాకనిపిస్తుంది.

రామ్‌గోపాల్‌వర్మ యెన్ని మాటలు చెప్పి యెంత నాసిరకమైన సినిమాని యెంత విసుగు కలిగించేలా తీసారన్నదే చాలా మందికి కనిపించవచ్చు గాక తెఱ మీద. నాకు మాత్రం చిట్టి (తక్కువ నిడివి) చలనచిత్రాలు తీసే చాలా మంది ఔత్సాహికులకు ఒక నమ్మకాన్నిచ్చారనిపిస్తుంది. పారితోషికం తగ్గించుకుని చలనచిత్ర నిర్మాతలకు మేలు చేయమని యెన్ని రకాలుగా అడిగినా తల ఒగ్గని నటులు నిర్ద్వంద్వంగా ముందుకు రావాలంటే చలనచిత్ర నిర్మాణకారులు చూపించవలసిన నమ్మకం తాలూకు నిలువెత్తు రూపం కనిపిస్తుంది. లాభాల్లో వాటాలే తప్పించి పారితోషికమివ్వకపోవటమన్న పద్ధతి చలనచిత్రరంగానికి మున్ముందు యే రకమైన క్రొత్త ఊపిరులూదగలదో కనిపిస్తుంది. “ఒక సినిమా చేస్తుండగా మఱో సినిమా గుఱించి ఆలోచిస్తే మహాపాపం, కళాసరస్వతికి అవమానం! అది యేకాగ్రతని దెబ్బ తీస్తుంది.” అని “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టు కబుర్లు చెప్పే చాలా మంది దర్శకులకు చెంపపెట్టులా కనిపిస్తుంది. కోడిరామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఉద్దండులు ఏకసమయంలో అనేక చిత్రీకరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఆశాభావం చిగురిస్తుంది.

కొసమెఱుపు: మన ఖర్మ యేమిటంటే సినిమాని ఆరున్నర లక్షల్లో తీసినా అరవై కోట్లతో తీసినా ప్రేక్షకుల నెత్తిన పడే టికెట్ ధరలో మార్పు లేకపోవటం. అది మాఱకపోతే నాలాంటి వాడికి యెన్ని ఆశలు చిగురించినా ప్రేక్షకుడికి జేబు చిఱుగుతూనే ఉంటుంది. ఎప్పటి లాగే అ.సం.రాలో ఈ చలనచిత్రానికి టికెట్ ధర $12. మఱి యీ దొంగల ముఠా వలన వచ్చే బాధలు తీర్చేదెవఱు?!

(షరా: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు చిత్రం కూడా నేనింకా చూడలేదు. ఒకవేళ అదీ బాగాలేదనిపించినా దానికీ, దీనికీ దీని తఱువాత రామ్‌గోపాల్‌వర్మ తీయబోయే చిత్రాలకి, అంతకు ముందు వర్మ తీసిన చిత్రాలకీ ముడి పెట్టబోను. దేని సంగతి దానిదే! మఱొక సంగతి కూడా చెప్పాలి: “వర్మ యింత కన్నా బాగా తీయగలడు” అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ, “పెట్టనమ్మ యెలాగూ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టే ముం*వి నీకేమయిం”దన్న బిచ్చగాడి సామెత చెప్పినట్టు కళాభిక్ష కోసం చూస్తున్న నాలాంటి వాడికి దర్శకుడు సరిగా తీయలేదని అతన్ని తిట్టే హక్కు మాత్రం ఉండదు. “నచ్చకపోతే చూడకండి. ఎలాగైనా చూడమని యెవడేడిసాడు?” అని వర్మయే అన్నారు ఎన్నోసార్లు.)

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:

ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:

  • ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
  • మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
  • చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
  • తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
  • తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
  • సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
  • తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.

పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)

షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.

ఇందుకా తెలంగాణా?! థూ… జీవితం!

మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారాగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.

“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:

నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుకుతూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!

సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!

సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు!

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతి భ్రమ్శాత్ బుద్ధినాశా బుద్ధినాశా పణశ్యతి

(భగవద్గీత – ఇది తెలంగాణా కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర కాదు… హర్యానాలో జఱిగింది.)

పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” అని చెప్పింది మనుస్మృతి. అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది. ఇలా అనగానే మన స్త్రీవాదులకు “మనువు” మీద మనసు మండుతుంది. మనుస్మృతి పాటించాలని అనటంలేదు. (పాటించాలంటే మఱి తద్దినపు భోజనంలో బ్రాహ్మణుడికి ఖడ్గమృగం మాంసం వడ్డించాలిట!) భారతీయ సమాజంలో అంతర్లీనంగా అంతటా ఉండే ఛాందసం అమ్మాయిలకు నయానో భయానో ఆజన్మాంతమూ సర్దుకుపోవటమే నేర్పుతుంది. ఇంట్లో వాళ్ళకెంత స్వేచ్ఛనిచ్చినా సమాజం మొత్తంలోనూ అంతటి భావవైశాల్యం లేదు కనుక యెన్నెన్నో రకాలుగా మన స్త్రీలు సర్దుకుపోవటాన్ని ఒక జీవనశైలిగా స్వీకరించటం జఱుగుతుంది. దానితో వాళ్ళు స్వచ్ఛందంగానూ ఆనందంగానూ తమ స్వాతంత్ర్యాన్ని భర్త, కుటుంబం, సమాజం వంటి బాహ్యాధిపతులకు విడిచిపెడతారు. ఇదే అన్ని సమస్యలకూ మూలమనిపిస్తుంది. మౌనమే భూషణంగా ఆధారపడటము, సర్దుకుపోవటము ఆడవాళ్ళకి అలవాటైపోయిన పరిస్థితిలోనే దోషముంది!

తనకంటూ ఒక రూపము, ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని – ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా – ఎందుకు తట్టుకోలేడు? తనలోని ప్రతి అంగము, ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు? ఏమిటి మగతనం గొప్ప? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా?! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు, ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన “ఘనత” అది. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మఱో బంధువు కావచ్చు – వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా? స్త్రీలకు రిజర్వేషన్లు “ఇవ్వటం”, స్వేచ్ఛని “ఇవ్వటం” – ఈ యివ్వటమేంటి అసలు?! ఒకరికి స్వేచ్ఛనిచ్చే “హక్కు”, “అధికారం” ఎవఱికున్నాయి?! వాళ్ళకి “ఉండవలసిన” స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా?! (ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు, శక్తిస్వరూపిణులు లేరా? హుఁ, ఉంటే మాత్రమేం లాభం? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా!) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా, మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది. ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు. అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు, కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు!

“ఉద్యోగమ్ పురుషలక్షణమ్” అన్న మాట పట్టుకుని స్త్రీలు ఉద్యోగాలు చేయరాదనేవాళ్ళు కొందఱు. సంస్కృతంలో “ఉద్యోగమ్” అంటే “ప్రయత్న”మనీ “పురుష” అన్న మాట మనుషులందఱికీ వర్తిస్తుందనీ గ్రహిస్తే “ప్రయత్నం చెయ్యటం మానవ లక్షణం” అని చెప్పారని అర్థమవుతుంది! “ఇంటికి దీపం ఇల్లాలు” అన్నది కూడా ఒక స్త్రీ వెలుగులీనే స్థాయిలో పురుషుడు వెలగలేడని అన్వయం కావచ్చు. అలాంటి దీపాలన్నీ నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న స్వార్థం భావ్యమా? స్త్రీలు యింట్లోనూ, ఉద్యోగంలోనూ రెండింటా పని వత్తిడిని తట్టుకోలేరని కొందఱి “బాధ”. ఇంట్లోనే అన్ని రకాల పనులు చెయ్యగలిగే స్త్రీ బైట మఱో పని చెయ్యలేదా?! ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు తగు సహాయమందిస్తే వత్తిడి తగ్గుతుంది కూడా! కాదా? అసలు స్త్రీ యింట్లో చేసే పనులకు విలువ కట్టగల షరాబులెవ్వఱు? ఉన్నారు… ఎవఱి జీవితాన్ని వాళ్ళే బ్రదికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తల్లులు సగటున చేస్తున్న ఇంటి పనులకు జీతంతో తూకం వేసింది ఒక సంస్థ. కొన్నేళ్ళ క్రితం చేసిన యీ పరిశోధనలో తేలిన విషయమేంటంటే జీతాలివ్వటమంటూ జఱిగితే ఒక్కో స్త్రీ చేస్తున్న పనులకి (రూపాయలలోకి మార్చితే) సంవత్సరానికి 54 లక్షల రూపాయలు ఇవ్వాలట!! అ.సం.రా దేశంలోనే అలా ఉంటే తల్లిగా/భార్యగా అన్నీ తానే అయి పని చేసే మన దేశంలో?! కనీసం ఊహించగలమా? పైగా “తల్లి ప్రేమని మించింది లే”దంటారు. స్త్రీలందఱికీ వేఱుగా “పిల్లలని ప్రేమించటమెలా?” అని పాఠాలు బోధిస్తున్నారా, లేదే? సహజసిద్ధంగా స్త్రీలలో ఉండే నిస్స్వార్థమైన ప్రేమ తల్లి ప్రేమ రూపంలో కనిపిస్తోందే కానీ వాళ్ళకి అలా ప్రేమించటానికి సమకూర్చబడిన జ్ఞానమూ, రెండో మనసూ లేవు! అది స్త్రీకి స్వతస్సిద్ధమైన లక్షణం కానప్పుడు స్త్రీలే అలా ప్రేమించగలరనుకోవటం కూడా తప్పే! తండ్రి అంతగా ప్రేమిస్తే కాదన్నదెవఱు?! మగవాడు కూడా అలా ప్రేమించలేకపోతే తండ్రి తప్పే కానీ తల్లి గొప్ప కాదు! (ప్రేమిస్తున్నామంటూ స్త్రీల వెనుక విసుగు లేకుండా తిఱిగే పురుషులు ఆ మాత్రం ప్రేమించగలరు లెండి!)

చలనచిత్రాల్లో, సాహిత్యంలో, ఇతర కళల్లో, సమాజంలో, జీవితంలో, విద్యలో, ఉద్యోగాల్లో, పెళ్ళిలో, కుటుంబంలో, ఇంట్లో… దాదాపుగా ప్రతీ చోటా మగవాళ్ళు ఆడవాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు తన జీవితంలోకి తొలి అడుగైనా వేయక ముందే తన జీవితాన్ని నిర్దేశించదలచిన మగవాడి కోసం యే ఆడదైనా యెందుకు సర్దుకుపోవాలి? తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే మఱొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక! స్త్రైణ్యం ముందు పౌరుషమెంత చిన్నబోతుందో గ్రహించి ప్రతి పురుషుడూ ఆ స్త్రైణ్యాన్ని కేవలం ఒప్పుకోవటం కాక దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అచ్చెఱువొందాలని, ఆరాధించాలని నా ప్రార్థన! మన గుఱించి మనం మఱచిపోయినా మనల్ని కనిపెట్టుకుని ఉన్న ఆ మఱొకరికి ప్రణమిల్లటం తప్పనిసరి!

స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అనీ, పురుషుడు పురుగు లాంటివాడనీ కాదు నా భావన. బేలగా కనిపించినంత మాత్రాన మన వయసు స్త్రీ మన కన్నా లోతుగా ఆలోచించగలిగి, జీవితాన్ని మన కన్నా ధైర్యంగా ఎదుర్కొనగలిగి ఆ పైన ఆ బేలతనాన్ని కూడా ఆస్వాదించగలదని మఱచిపోరాదు. మగవాడు మ్రాన్పడిపోయిన యెన్నో సందర్భాలలో – పురాణాలలో కైకేయి, సత్యభామలతో సహా – స్త్రీ సారథ్యంలోనే సమస్యలు పరిష్కరింపబడటం కద్దు. ఒక దర్శకురాలిగా (director), కార్యనిర్వహణాధికారిగా (manager), సంయామికగా (administrator), ఒక ఆర్థికవేత్తగా (economist), ఒక గురువుగా (teacher), …మగవాడి ఊహకు కూడా అందని యెన్నో రకాలుగా తన జీవితంలో విభిన్నమైన భూమికలు పోషించే స్త్రీకి నా జీవితమే జోహారుగా అర్పిస్తాను!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర – దానినిప్పుడు తెనిగించాను.)

షరా: 1. గతంలో మాతృదినోత్సవం నాడు వ్రాసిన టపాలో యిలాంటి దినాల మీద నా అభిప్రాయాన్ని పంచుకున్నాను కనుక మఱలా చెబితే చర్వితచర్వణమవుతుంది.
2. “పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు…” అన్న పంక్తి 1988వ సంవత్సరంలో విడుదలైన “ఆడదే ఆధారం” అన్న చలనచిత్రం కోసం శ్రీ సీతారామశాస్త్రి వ్రాసిన “మహిళలు మహరాణులు…” అన్న నిందాత్మక(స్తుతి)గీతంలోనిది.

దేవుడా, ఓ మంచి దేవుడా!

నువ్ మాకు అంతర్జాలంలో చూడటానికి గంట నిడివి చిత్రం మిస్సమ్మ NRI యిచ్చావ్, ప్రధానవాహినిలో ఇంకోసారి యిచ్చావ్, …గోల్కొండ హైస్కూల్ కూడా యిచ్చావ్. ఇలాగే తెలుగులో యేటా విడుదలయ్యే దాదాపు 50 నేఱు-చిత్రాలకు కూడా యివ్వాలి. అలాగే వేఱే భాషల నుంచి వచ్చి తెలుగులో విడుదలయ్యే దాదాపు 40 అనువాదచిత్రాలకు కూడా యివ్వాలి. అదే చేత్తో మొత్తం దేశంలోని అన్ని భాషల్లో విడుదలయ్యే… నాకు number correctగా తెలీదు… ఎన్ని విడుదలైతే వాటన్నిటిక్కూడా ఇలాగే అంతర్జాలపు విడుదల చేస్తావని… అంటే as it is గా యివే కాదు… YouTube Rentals, RajshriTelugu, TeluguOne …అలాగనమాట. అలా యిస్తావని కోరుకుంటున్నాను. నువ్వు యిస్తావు… నాకు తెల్సు! ఎందుకంటే… basically you’re God. You’re very good God!” అహ్ఁ, ఆహ్ఁ, అంతే!

(తెలుగు చలనచిత్రాలు అంతర్జాలంలో అధికారికంగా విడుదలై న్యాయబద్ధంగా చూడగలిగే అవకాశం కల్పిస్తున్న నిర్మాతలకు నెనర్లు. పై మూడు చిత్రాలు నేను చూసాను. మిస్సమ్మ NRI మాత్రం నేనా చిత్రానికి ఇతివృత్తగీతం వ్రాయటం వలన DVD పంపగా అలా చూసాను కానీ తక్కినవి అంతర్జాలంలో చూసినవే. బ్రోకర్ చిత్రం తెలుగువన్‌లో ఉందని చూసాను. అదీ అవజేస్తాను త్వరలో.)

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!

క్రొత్త “యేటి” అభిషేకం: ఆత్మావలోకనానికి అవకాశం

(ఈ టపాకి స్వీయ ఆంగ్లానువాదాన్ని యిక్కడ చదవగలరు.)

పొరపాటున చెయి జాఱిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?

పొరపడినా, పడినా జాలి పడదే కాలం మన లాగా!
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చే దాకా!

(ఇవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి కూర్చిన మాటలే అయినా మన మనసుల భాష యిది – అది ఏకవచనమే! ఎందుకంటే యీ హెచ్చరికలు చేస్తున్నది మన అందఱి సొంత గొంతుక!)

… ”నీ ప్రశ్నలు నీవి” యని మనకు గుర్తు చేసిన కాలం “ప్రశ్నలోనే బదులు ఉంది” అనీ అంత కన్నా ముందే చెప్పింది. విన్నామా, గ్రహించామా, నేర్చుకున్నామా, పాటించామా అన్నది ముఖ్యం. 2010 వెళ్ళిపోకా తప్పదు. 2011 రాకా తప్పదు. ఆ మధ్యన మనమెంత బాగుపడ్డాము, ఎంత మందిని/దేన్ని ఎలా బాగు చేసాము, ఎన్ని/ఏం పాఠాలు నేర్చుకున్నాము? అన్నవే ముఖ్యం. క్రొత్త సంవత్సరం మఱిన్ని పాఠాలు తెచ్చే లోపు పాత పాఠ్యక్రమం (స్య్ల్లబుస్) మొత్తమూ పునఃపునః ఔపోసన పట్టడం మన వంతు. అది చేయకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మాఱినా కాలం-డర్ (కాలమంటే భయం) మాఱదు. క్రొత్త యేటిని మనం ఆహ్వానించటం కాదు చెయ్యవలసినది – అది మన పూనిక లేకపోయినా యెలాగూ వస్తుంది. క్రొత్త యేడనే మందిరంలో మనం అడుగు పెట్టబోయే ముందు మనకై మనమే పూనుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి. మన ప్రతి ఆచారం వెనుక ఒక భయం కానీ భక్తి కానీ ఉంటాయంటారు. ఈ నూతనసంవత్సరాహ్వానం భయంతో చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, భయమూ భక్తీ మఱచిన మౌఢ్యంతో చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి… కాలం మనల్ని దాటిపోకముందే.

శివోహమ్

అసంభవమై,
ప్రళయకాల జృంభణమై,
లయమే తన లయగా
భూనభోంతరాళాలు ఏకమయ్యేలా
చెలరేగిన కరాళ నృత్యం –
అస్తవ్యస్తమైన ఆంగికంతో
తెలియని సంయోగాన్ని సాధించే యత్నం…
చిరపరిచిత అభ్యాసం,
స్వరపరచని విన్యాసం!
విలయకారుని సాన్నిధ్యంలో
సమయపాలన సరి నైవేద్యం!

లయబద్ధమైన ప్రతి అడుగూ
అహంభావాన్ని దూరం చేస్తూ
విలయమే ఆవహించినట్టు
స్వయంగా సమర్పితమౌతూ
అప్రయత్నంగా
అన్యోన్యత నాహ్వానిస్తూ
అనాలోచితంగా
అధిదేవుని కంకితమౌతూ…

శంకరుని స్వేదామృతగీతాలే
జగన్మాత క్షీరోధృతిపాతాలై,
మనశ్శాంతి సంకేతాలై,
అచంచల విశ్వాసాలై,
లోకనాథుని నిశ్వాసాలై,
శివకరుణాదృక్‌శీకరాలే
సర్వేంద్రియ వశీకరాలై…
స్పందించే జగత్సమస్తం
మౌనాశ్రిత సమ్మోహితం!

పదఘట్టన లేదు,
నవజాతశిశువు లాస్యం తప్ప!
కనులు తెరిచిన తొలి సంభ్రమం –
అస్తిత్వంలో నాస్తి యైనట్టు
భువనఘోషలో చిరు కూడిక –
తుది శ్వాసలోని జీవమే
పరమాద్భుతమైనట్టు…
ఇక నృత్యం లేదు,
ఉచ్ఛ్వాసం లేదు,
సశరీర సాక్ష్యం లేదు,
అత్యుత్తమ జ్ఞానం లేదు,
ఐక్యమయ్యే కారణం లేదు!
ఉన్నది …ఒక్కటే!

(మూలం: <http://parnashaala.blogspot.com/2009/05/blog-post.html> వద్ద మహేశ్ గారు ఉటంకించిన శేఖర్ కపూర్ విరచిత ఆంగ్లకవిత “Dancing with Shiva”.)

షరా: ఆ పుటలోనే ఉన్న మహేశ్ గారి తెలుగు సేత కానీ వ్యాఖ్యాల్లో కనిపించే రేరాజు గారి ప్రయత్నం కానీ ఈ కవితకు మూలం కాదు. అన్నీ ఒకే కవితకు అనుసృజనలు/అనువాదాలు కనుక కొన్ని పదాలు, భావాలు ఒకేలా అనిపించవచ్చు. మూలం కన్నా నాకు మహేశ్ గారి ప్రయత్నమే నచ్చింది. కానీ, చాలా వరకూ సరళమైన భాషతోనే చేసిన మహేశ్ గారి అనువాదంలో యేదో లోపించిందన్న భావన కలిగింది. “చక్కని అనువాదం. కానీ, మరింత చిక్కగా ఉండి ఉండవచ్చు.” అన్న వ్యాఖ్య వారి ఫేస్‌బుక్ గోడ మీద వ్రాసాక నేనూ ప్రయత్నించాలనిపించింది. (రేరాజు గారి అనువాదం చూసే లోపే నేను వ్రాద్దామని నిర్ణయించుకున్నాను కనుక ఆయన అనువాదం నేను “చూసాను” కానీ చదవలేదు.) నా అనువాదం న్యాయం చేసిందని నేను అనుకోవటంలేదు. నిజానికి ఇప్పుడు చూస్తే నా అనువాదం చిక్కగా ఉంది కానీ, చక్కగా లేదనే నా అనుమానం. కానీ, ఒకే ఆంగ్లమూలానికి మూడు అనువాదాలు చదివే అవకాశం ఎప్పుడో కానీ రాదు కనుక ఆ ఉద్దేశమైనా నెరవేరుతుందని నా ఊహ.

శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
“నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?”

ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని అనిపించనంత చిరంజీవి వేటూరి! “అజరామరం” అని ఎన్నో విషయాల్లో అనాలోచితంగా అనేస్తాం! “నిజంగా జర (ముసలితనం), మరణం లేనివి ఉంటాయా?” అంటే ఉండవేమో… కానీ వేటూరి గారు మాత్రం వయసు వల్ల శరీరం వంగిపోయినా, మనసూ అందులోని భావాలు మాత్రం జరామరణాలకి అతీతంగా, ఎన్ని యేళ్ళైనా యవ్వనంతో పరవళ్ళు తొక్కుతాయనిపిస్తుంది!

“వళిభిర్ముఖమాక్రాన్తమ్ పలితేనామ్ కితమ్ శిరః గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే!”
(“మొహమంతా ముడతలు వచ్చేసాయి, తల మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం శిథిలమైపోయింది, కానీ [నాలో] తపన మాత్రం యౌవనోత్సాహంతోనే ఉంది!”) భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం వేటూరి గారికి నప్పినట్టుగా ఎవరికీ నప్పదేమో.

నేను శ్రీ  వేటూరి సుందరరామమూర్తి గారిని కలవటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. “తానా 2000” కోసమని మా యూనివర్సిటీ పట్నానికి 250 మైళ్ళ దూరంలోని డాలస్‌కి వచ్చిన వేటూరి గారిని మా చిన్న ఊరి వాస్తవ్యులైన ప్రకాశరావు గారు, కొత్తప్ప చెట్టి గారు, చెట్టి గారి శ్రీమతి లక్ష్మి గారు మా యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అప్పటికి నేను TeluguCinema.Com లో చేరి ఆరు నెలలైనా కాలేదు! అప్పటి దాకా నేను ఎవరినీ interview చెయ్యాలని, చెయ్యగలననీ అనుకోనూలేదు! అటువంటి పరిస్థితులలో వేటూరి గారిని interview చేయటానికి ఆస్కారముందా అని చెట్టిగారిని అడిగాను, శ్రీ అట్లూరి గారి ప్రోత్సాహంతో. అంతటి ఆఖరి నిముషంలో అడిగినా వేటూరి గారు వెంటనే ఒప్పుకున్నారు!

సినీపరిశ్రమలో ఎవరితోనూ కాసేపైనా నిలబడి మాట్లాడని నేను నా మొదటి interview ఏకంగా గుగ్గురువులైన వేటూరి గారినే చెయ్యాలనేసరికి అలవి కాని ఉత్సాహం! ప్రశ్నలు తయారు చేసుకుందామనే సరికి భయం మొదలైంది. వేటూరి గారు ఆహూతులైన 50-60 మంది విద్యార్థులు, కొన్ని తెలుగు కుటుంబాల వాళ్ళు ఆసక్తిగా వింటూండగా ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి మనసు విప్పి మాట్లాడుతున్న తీరుకి నాలో భయం చాలా వరకే పోయిందనిపించింది. (ఆ ఉపన్యాసం అవగానే interview చెయ్యాలి.) ఆ తరువాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసారు చెట్టి గారు, ప్రకాశరావు గారు. వెంటనే పాదాభివందనం చేసాను. నిజం ఒప్పుకోవాలంటే అందులో భక్తి కన్నా వణుకు ఎక్కువై తూలి పడతానేమో అన్నంత తడబాటు కలిగి అదే ఊపుతో ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆశీర్వదించి, భుజాలు పట్టుకుని లేపారు. తడబాటు చేతులూ కాళ్ళ నుంచి మాటకి పాకింది! ఎలాగో చెప్పాను ఆయనకి interview సంగతి. “ఓహో, మీరేనా? రండి. ఎక్కడ కూర్చుందాం?” అన్నారు. అప్పటికి నా వయసు 22! ఆ వయసులో “మీరు” అనిపించుకోవటమే ఇబ్బందికరమైతే నా కన్నా 40 యేళ్ళు పెద్దయిన పండితుడూ, యశోవంతుడు అయిన వేటూరి గారు నన్ను “మీరు” అని సంబోధించటం నా తడబాటుని మరీ పెంచేసింది. “ఇక్కడే” అని అప్పటికే అక్కడ వేసుకున్న కుర్చీలు, బల్లా చూపించి నన్ను ఏకవచనంతోనే సంబోధించమని అర్థించాను. “ఇక్కడికొచ్చి పెద్ద చదువులు చదువుతున్నారు… మర్యాద నీలోని సరస్వతికి!” అన్నారు. “స్వామీ, సరస్వతి మీలోనే ఉన్నది. నేను విద్యను అర్థిస్తున్న వాడిని.” అన్నాను. (అయినా ఆయన “మీరు” అంటూనే మాట్లాడారు చాలా వరకూ. అదీ ఆయన సంస్కారం!) ఇంతలోనే నా చేతిలో ఏదో పుస్తకం కూడా ఉండటం చూసి ఆయనకున్న అనుభవం దృష్ట్యా వెంటనే అడిగారు, “మీరు కూడా కవితలు వ్రాస్తారా?” అని. ఊహించని (సమయంలో వచ్చిన) ప్రశ్న! “పాటలు వ్రాస్తాను, పద్యాలు వ్రాయటమూ నేర్చుకుంటున్నాను. కవితలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను.” అన్నాను బెరుకుగానే. “భేష్, రచనాసరస్వతి కూడా ఉంది మీలో! …అవి చివర్లో చూద్దాం. ముందు interview కానివ్వండి” అన్నారు. చెప్పాను, నాకదే మొదటి interview అని, తప్పులు చేస్తే క్షమించమని. “నేనూ పాత్రికేయుడిగానే మొదలు పెట్టాను నా ప్రస్థానం. నువ్వూ ఆ దారిలో ఉన్నావన్న మాట! ఏమీ భయపడకు.” అని భుజం తట్టారు. ధైర్యం తెచ్చుకుని interview పూర్తి చేసాను. ఓపికగా సమాధానం చెప్పారు అన్ని ప్రశ్నలకీ. చివరగా నన్నూ మళ్ళీ ప్రోత్సహించారు మొదటిదైనా చాలా బాగా చేసానని. ఆయన మాట వరసకి అన్నారేమో తెలియదు కానీ అలా జరిగిన అంకురార్పణ తరువాత నేను TeluguCinema.Com కోసం చేసిన పదుల interviewలకు నమ్మకాన్నిచ్చే పునాది అయింది! అప్పటికి ఇంకా అప్పుడప్పుడే కలం విదిలిస్తున్న నేను ఆయనకి నా వ్రాతలు చూపించాలి అనుకోవటం సాహసమే ఒక రకంగా. (వాటిని “రచనలు” అనే సాహసం కూడా చేసే ధైర్యం లేదు అప్పటికి పూర్తిగా.) నా పిల్లవ్రాతలతో తన సమయం వృధా చేసారని గద్దిస్తారేమోనన్న భయం లోలోపల ఉండింది. అందుకే అసలు చూడమని ఆయనని ఎలా అడగాలా అని మల్లగుల్లాలు పడుతున్నాను ఆయన్ని కలిసే సరికే. అటువంటిది, ఆయనకై ఆయన నా చేతిలో పుస్తకాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పోసినట్టైంది! భయమూ తగ్గింది, నా వ్రాతల్లో పస లేకున్నా ఆయనకై ఆయనే చూస్తానన్నారు కనుక ఎక్కువగా తిట్టరేమోనని. Interview సాగుతున్న సమయంలోనే ఆయన ఎంతటి సౌమ్యులో అర్థమైంది. దానితో కోపగించుకోరని పూర్తిగా ధైర్యం వచ్చింది. Interview పూర్తయ్యాక ఆయన తన కళ్ళజోడు తెచ్చుకోలేదనీ, కనుక నన్నే నా వ్రాతలు పైకి చదవమని పురమాయించారు. మామూలుగానైతే గొంతులో పచ్చి వెలక్కాయ పడేదేమో! కానీ అప్పటికే ఆయన ఇచ్చిన ధైర్యం అచంచలమై నేనే గొంతు సవరించుకున్నాను. ఆయనకి విపించిన పద్యాలు మూడో నాలుగో. వాటిలో రెండు ఆయన మీదే వ్రాసినవని గుర్తు. (“సుందరరామ్మూర్తి గారి సొంపగు పాటల్” అన్నది ఒక పద్యం చివరి పాదమైతే “వేటూరీ, మేటివీవు విజ్ఞతనందున్” అన్నది రెండవది. పూర్తి పద్యాలు నా దగ్గర లేవు.) ఆయన విద్వత్తును మెచ్చుకుంటూ, కీర్తిస్తూ పద్యాలు వ్రాయగలిగినా అయాచితంగా వాటిని నా గొంతుతో నేనే చదివి ఆయనకి వినిపించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు! నే వినిపించిన మరో కంద పద్యం ఆయనకి చాలా నచ్చింది: “ఫ్యాషనులని నేటి యువత / భాషను ఖూనీలు జేయ భావము చచ్చెన్ / కాషను చెప్పెడు పెద్దల / ఘోషను పట్టించుకొనరు ఘోరం కాదా!” అన్నది ఆ పద్యం. “బాగా వ్రాసారు, మీరు కూడా సరైన పాళ్ళలో పరభాషా పదాలు కలుపుతూ. చక్కగా ఉంది” అన్నారు. (అప్పటికి interview లోనే పరభాషా పదాల వాడకంపై కాస్త చర్చ జరిగింది.) ఒక పాట కూడా చదివి వినిపించాను: “కొమ్మల్లో కోయిలమ్మ కొత్త పాట పాడగా, గున్నమావి చెట్టు లేత చిగురులేయగా – వసంతమొచ్చెనే ఇలకే అందమై వనములన్ని పచ్చని వెలుగు నింపగా! రావే వసంతమా, వయ్యారమై ఉగాదితో – చేసెయ్ సరాగమే పచ్చపచ్చని వనాలలో” అన్నది ఆ పల్లవి. “ఇంకొన్నేళ్ళు… అక్కర్లేదు, ఇంకొన్నాళ్ళు ఇలాగే వ్రాసినా మీరు సినిమాల్లో గీతరచయిత అయిపోవచ్చు… మీకు ఆ ఉద్దేశం ఉంటే” అన్నారు. కేవలం ప్రోత్సాహకరంగానే ఆ మాటలన్నారని ఇప్పటికీ నమ్ముతున్నా కానీ… నా ఉద్దేశాలన్నీ తెలిసినట్టు, నా మనసు చదివేసినట్టు నాకు కావలసిన ప్రోత్సాహమే ఆయన ఇవ్వటంతో నా జన్మ ధన్యమైంది! అప్పటి దాకా “గీతరచయితని కాగలనా? నాలో నిజంగానే ఒక ‘కవి’ ఉన్నాడా?” అన్న ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం లేని నా మనసులో ఒక నూత్నతేజాన్ని నింపాయి శ్రీ వేటూరి సుందరామమూర్తి గారి మాటలు!

ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ కలం కదులుతూనే ఉంది, ఆయన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే నేను అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాల పుటలు తిప్పాను. “మళ్ళీ వేటూరి గారిని కలవనేలేదు. ఇప్పటికైనా సెప్టెంబరు 8 కి ఆయనని interview చేసి పదేళ్ళైన సందర్భంగా ఈ పదేళ్ళూ ఆయన పలికిన ప్రోత్సాహపు మాటలే నా పురోగతికి ఎంతటి సహాయం చేసాయో ఆయనకి చెప్పుకుందామని, ఆయన ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులతో ఆ మాటే అన్నాను కూడా. ఇంతలోనే… ఈ వార్త!

“పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు! ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు! నువ్ పుట్టిన మన్నేరా నిన్ను తిన్నది! కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది! చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి!” …అని ఆయన మాటల్లోనే అనుకోవాలా?

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు! తరతరాలకూ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు!” …అన్న ఆయన మాటల స్ఫూర్తితోనే ముందుకు సాగిపోవాలా?

“నీ పాట ఒక్కటే నిజం లాగా / నిర్మలమైన గాలి లాగ / నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే / శుక్త మౌక్తికం లాగ … నువ్వు లేవు, నీ పాట ఉంది” …అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలే చెవుల్లో మోగుతుంటే “రాజు మరణించె, ఒక తార నేల రాలె / కవియు మరణించె నొక తార గగనమెక్కె” …అన్న జాషువా మాటల్లోని నిజాన్ని చూసి సంతోషించాలా?

“జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువమ్ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వమ్ శోచితుమర్హసి” …అని గీతాకారుడు చెప్పినది సబబే! (పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.) ఎందుకంటే, భర్తృహరి అన్నట్టు కవుల యశస్సు (అనే శరీరం) జరామరణాల భయానికి అతీతమైనది!

“జయన్తి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి యేషామ్ యశఃకాయే నాస్తి జరామరణజమ్ భయమ్!” – నిజమే, కళాకారులకు మరణం లేదు! ముఖ్యంగా కవులకు! అతిముఖ్యంగా శ్రీ వేటూరి సుందరరామమూర్తి వంటి కవికి – తెలుగు సినీజగత్తులో అతి సాధారణ సందర్భాల్లో వచ్చే పాటల్లో కూడా కవిత్వం గుప్పించి మెప్పించవచ్చని నిరూపించి సజీవతార్కాణంగా తరతరాలకూ దిక్సూచిగా నిలబడిన మనీషికి!